న్యూఢిల్లీ, డిసెంబర్ 2: బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.473 ఎగిసి రూ.54,195కు చేరింది. వెండి ధరలు కూడా ఎగబాకాయి. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.1,216 అందుకుని రూ.66,064 ను తాకింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ పుత్తడి విలువ రూ. 53,730గా ఉన్నది. గురువారంతో చూస్తే రూ.550 పెరిగింది. అలాగే 22 క్యారెట్ రేటు రూ.49,250 పలికింది. అలాగే కిలో వెండి ధర రూ.1,200 అందిపుచ్చుకుని రూ. 71,000లుగా నమోదైంది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 1,801.25 డాలర్లుగా ఉన్నది. ఔన్సు వెండి ధర 22.73 డాలర్లు నడుస్తున్నది. ‘ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్ల పెంపు వేగాన్ని తగ్గించే వీలుండటంతో డాలర్ బలహీనపడుతున్నది. ఈ క్రమంలోనే గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతూపోతున్నాయి’ అని మోతీలాల్ ఓస్వాల్ సీనియర్ ఉపాధ్యక్షుడు నవ్నీత్ దమానీ అన్నారు.