న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: గోల్డ్ మార్కెట్ రోజుకో రికార్డుతో షేక్ చేస్తున్నది. మునుపెన్నడూ లేనివిధంగా బంగారం ధరలు సరికొత్త స్థాయిల్లో కదలాడుతున్నాయి మరి. మంగళవారం పుత్తడి విలువ ఏకంగా 74వేలపైకి చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాములు ఆల్టైమ్ హైని తాకుతూ తొలిసారి రూ.74,130గా నమోదైంది. సోమవారం ముగింపుతో చూస్తే ఒక్కరోజే రూ.980 ఎగబాకింది. అంతకుముందు రోజూ రూ.600 ఎగబాకిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో ఈ పెరుగుదల రూ.73,750గా ఉన్నది. కాగా, స్పాట్ మార్కెట్లో పన్నులతో కలుపుకొని మేలిమి బంగారం ధర తులం రూ.75,000 దాటడం గమనార్హం.
గడిచిన మూడున్నర నెలల్లో పుత్తడి రేటు తులం ఏకంగా రూ.10వేలపైనే పెరగడం విశేషం. ఈ ఏడాది జనవరి 1న హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.63,870 వద్ద ముగిసింది. ఇప్పుడు రూ.74,130 వద్ద స్థిరపడింది. దీంతో ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూ.10,260 ఎగిసినైట్టెంది. 22 క్యారెట్ (నగల బంగారం) కూడా నాడు తులం రూ.58,550 మాత్రమే. నేడు రూ.67,950. రూ.9,400 పెరిగింది.
హైదరాబాద్లో కేజీ వెండి రేటు కొత్త రికార్డును సృష్టిస్తూ రూ.87,000కు చేరింది. ఈ ఒక్కరోజే రూ.1,000 పెరిగింది. ఢిల్లీలోనూ రూ.800 ఎగిసి రూ.86,500గా ఉన్నది. ఇక ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా వెండి ధర కిలోకు రూ.8,400 పుంజుకున్నది. జనవరి 1న రూ.78,600 వద్ద ముగిసినట్టు రికార్డులు చెప్తున్నాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో పసిడి విలువ ఔన్సు 2,370 డాలర్లుగా ఉన్నది. వెండి 28.40 డాలర్లు పలికింది.