Gold Price | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరువయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరగడంతోదేశీయంగా ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర మరో రూ.450 అందుకొని రూ.64,300 పలికింది. ఈ నెల 4 తర్వాత రికార్డు స్థాయికి ధరలు చేరుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం. డిసెంబర్ 4న తులం బంగారం రూ.64,300 పలికిన విషయం తెలిసిందే. పసిడితోపాటు వెండి పరులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.400 పెరిగి రూ.79,100 నుంచి రూ.79,500కి చేరుకున్నది. అలాగే ఇటు హైదరాబాద్లోనూ తులం బంగారం రూ.430 ఎగబాకింది. దీంతో 24 క్యారెట్ బంగారం రికార్డు స్థాయి రూ.64,250కి చేరుకున్నది.
నగల తయారీలో వాడే 22 క్యారెట్ పసిడి సైతం రూ.400 అందుకొని రూ.58,900కి చేరుకున్నది. అలాగే కిలో వెండి రూ.300 పెరిగి రూ.81 వేలు పలికింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,080 డాలర్లకు చేరుకోగా, వెండి 24.31 డాలర్లు పలికింది. కామెక్స్ స్పాట్ గోల్డ్ మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నిరుద్యోగుల డాటా విడుదలకానుండటంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు తమ పెట్టుబడులు మళ్లించినట్టు పేర్కొన్నారు.