Gold Rate | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: బంగారం ధరలు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా దిగొస్తున్న రేట్లు.. బుధవారం భారీగా క్షీణించాయి. దీంతో హైదరాబాద్లో తులం ధర రూ.63 వేల దిగువకు చేరింది. ఈ ఒక్కరోజే 24 క్యారెట్ పసిడి విలువ 10 గ్రాములు రూ.660 క్షీణించి రూ.62, 180 వద్ద నిలిచింది. 22 క్యారెట్ పుత్తడి రేటు కూడా 600 పడిపోయి రూ.57,000లుగా నమోదైంది. ఈ క్రమంలోనే గడిచిన వారం రోజుల్లో 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,000, 24 క్యారెట్ రూ.1,050 కోల్పోయినైట్టెంది. ఢిల్లీలోనూ ఇదే వరుస కొనసాగుతున్నది. బుధవారం స్పాట్ మార్కెట్లో రూ.750 క్షీణించి 24 క్యారెట్ పుత్తడి ధర రూ.62,350కి పరిమితమైంది.
దేశీయ మార్కెట్లో క్షీణించిన డిమాండ్కుతోడు అంతర్జాతీయ విపణిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు.. బంగారాన్ని వెలవెలబోయేలా చేస్తున్నాయి. అంచనాలను మించి అమెరికా ద్రవ్యోల్బణం పెరగడం.. పుత్తడి ధరలకు సెగ పెడుతున్నదని ట్రేడింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 3.1 శాతంగా ఉన్నది. నిజానికి 2.9 శాతానికి దిగొస్తుందని ఊహించారు. కానీ ఆశించిన స్థాయిలో తగ్గకపోవడంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లకు కోత పెడుతుందనుకున్న ఫెడరల్ రిజర్వ్.. మరికొంతకాలం కీలక వడ్డీరేట్లను అధిక స్థాయిలోనే ఉంచవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం గోల్డ్ నుంచి మదుపరుల పెట్టుబడులను దూరం చేస్తున్నది. మరోవైపు కోమెక్స్ స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం విలువ 2వేల డాలర్ల దిగువకు పడిపోయింది. 1,995 డాలర్లు పలికింది. గత ముగింపు కన్నా ఇది 26 డాలర్లు తక్కువ. ఈ స్థాయికి పతనమవడం డిసెంబర్ నుంచి ఇదే తొలిసారి.
వెండి ధరలూ పతనం దిశగానే నడుస్తున్నాయి. బుధవారం హైదరాబాద్లో కిలో ధర రూ.1,500 క్షీణించి రూ.75,500 వద్ద స్థిరపడింది. ఢిల్లీలోనూ రూ. 1,400 దిగి రూ.74,000లుగా నమోదైం ది. గ్లోబల్ మార్కెట్లో ఔన్సు 22.82 డాలర్లుగా ఉన్నది. ఇండస్ట్రీ వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడం కూడా మార్కెట్లో ధరల క్షీణతకు ఓ కారణమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.