న్యూఢిల్లీ, నవంబర్ 17: బంగారం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న రేట్లతో పసిడి విలువ రూ.62,000లను సమీపిస్తున్నది. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.650 ఎగబాకింది. దీంతో రూ.61,690గా నమోదైంది. ఆభరణాల బంగారంగా భావించే 22 క్యారెట్ పసిడి రేటు సైతం రూ.600 ఎగిసి రూ.56,550 పలికింది. మొత్తంగా చూసినైట్టెతే మూడు రోజుల్లో 24 క్యారెట్ బంగారం రేటు రూ.1,200 పుంజుకోగా, 22 క్యారెట్ రూ.1,100 అందిపుచ్చుకున్నది. ఇక ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు రూ.540 పెరిగి రూ.61,750గా ఉన్నది.
బంగారం ధరలతో పోటీపడుతూ వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండి ధర హైదరాబాద్లో శుక్రవారం ఒక్కరోజే రూ.1,500 పెరుగడం గమనార్హం. దీంతో రూ.79,500లను తాకింది. గత నాలుగు రోజుల్లో రూ.4,100 ఎగబాకడం విశేషం. బుధవారమైతే ఏకంగా రూ.1,700 పుంజుకున్నది. ఢిల్లీ మార్కెట్లోనూ రూ.1,200 ఎగిసి రూ.76,500 వద్ద నిలిచింది. అటు ఇన్వెస్టర్లు, ఇటు ఇండస్ట్రీ వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ట్రేడర్లు ప్రస్తుత మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లోనూ పెరిగేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దౌడు తీస్తున్నాయి. శుక్రవారం ఔన్సు గోల్డ్ 1,984 డాలర్లు పలికింది. వెండి 23.86 డాలర్లుగా నమోదైంది. గురువారం ముగింపుతో పోల్చితే గోల్డ్ 17 డాలర్లు పెరిగింది. సిల్వర్ మాత్రం స్వల్ప వృద్ధినే కనబర్చింది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో క్షీణత కొనసాగితే.. మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత సాధనంగా భావించే బంగారం వైపే మళ్లిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బంగారం కావచ్చు.. వెండి కావచ్చు.. ఏదైనాసరే వాటి ధరలు స్థిరంగా ఉంటేనే గిరాకీ బాగుంటుందని వ్యాపారులు చెప్తున్నారు. ధరలు తగ్గుముఖం పడితే ఇంకొద్ది రోజులు ఆగితే మరింత దిగొస్తాయన్న ఆశ కొనుగోలుదారుల్లో ఉంటుందని, అదే పెరుగుతూపోతుంటే తగ్గినప్పుడు కొందాంలే అన్న ధోరణి కనిపిస్తుందని వర్తకులు వివరిస్తున్నారు. మొత్తంగా ధరల్లో స్థిరీకరణ లోపిస్తే మార్కెట్లో వేచిచూసే వైఖరే ఉంటుందని అంటున్నారు. ధరలు నిలకడగా ఉంటే మాత్రం కస్టమర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారని పేర్కొంటున్నారు.