హైదరాబాద్, అక్టోబర్ 22: ధన్తేరాస్ సందర్భంగా వినియోగదారులకు షాక్నిస్తూ బంగారం ధరలు భగ్గుమన్నాయి. శనివారం హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి తులం ధర ఒక్కసారిగా రూ.830 మేర ఎగబాకి రూ.51,280కి చేరింది. ఆభరణాల పసిడి ధర రూ.750 ఎగిసి రూ.47,000లను తాకింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది డిసెంబర్లో తక్కువ మోతాదులోనే వడ్డీరేట్లను పెంచాలని భావిస్తున్నట్టు వెలువడిన వార్తలతో గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పరుగులు పెట్టాయి. ఔన్సు ధర 26 డాలర్ల వరకూ పెరిగి 1,662 డాలర్ల స్థాయి వద్ద నిలిచింది. ఈ ప్రభావంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి. మరోవైపు స్థానికంగా కిలో వెండి ధర సైతం రూ.1,700 పెరిగి రూ.63,200లకు చేరింది. ఇక న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం రూ.840 ఎగిసి రూ.51,440 వద్దకు చేరగా, ముంబైలో రూ.830 ఎగబాకి రూ.51,280 స్థాయిని అందుకుంది.
మొదలైన ధన్తేరాస్ సందడి
ధన్తేరాస్ (ధన త్రయోదశి) సందడి మొదలైంది. ఈసారి ఆదివారం ఈ శుభదినం ఉన్నప్పటికీ.. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచే ముహూర్తం వచ్చిందని, ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఇది ఉంటుందని పండితులు చెప్తున్నారు. దీంతో మార్కెట్లో ఈ ప్రభావం కనిపిస్తున్నది. ఇక రద్దీ దృష్ట్యా ఉదయం నుంచే కావాల్సిన నగలను కస్టమర్లు బుక్ చేసుకుంటున్నారని అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి చైర్మన్ ఆశిష్ పీతే పీటీఐకి తెలిపారు. నిజానికి గత 2, 3 రోజుల నుంచే దుకాణాలకు కొనుగోలుదారులు పెరిగారని వ్యాపారులూ అంటున్నారు. దీంతో ఈసారి అమ్మకాలు బాగుంటాయన్న విశ్వాసం వారిలో వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలోనే నిరుడుతో పోల్చితే ఈసారి 20 శాతం ఎక్కువగా అమ్మకాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, హిందూ సంప్రదాయంలో కొత్త వస్తువులు, ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లకు ధన్తేరాస్ శుభప్రదమైన రోజు అని నమ్ముతున్న విషయం తెలిసిందే.
రూ.40వేల కోట్ల వ్యాపారం
ఈ ధన్తేరాస్కు దాదాపు రూ.40,000 కోట్ల వ్యాపారం జరగవచ్చని అఖిల భారత వర్తకుల సమా ఖ్య (సీఏఐటీ) శనివారం అంచనా వేసింది. ఈసారి శని, ఆదివారం రెండు రోజుల్లోనూ వ్యాపారం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే సుమారు రూ.40,000 కోట్ల వ్యాపారం జరగవచ్చని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్తీయ అంచనా వేస్తున్నారు.
ఆటో పరిశ్రమలో జోష్
ధన్తేరాస్ ఉత్సాహం దేశీయ ఆటో పరిశ్రమలోనూ కనిపిస్తుంది. దీపావళి పండుగకు ముందురోజు వచ్చే ఈ శుభదినాన వాహనాలను సొంతం చేసుకోవాలని చాలామంది కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఈసారి కార్లు, ద్విచక్ర వాహనాల డెలివరీలు రికార్డు స్థాయిలో ఉండొచ్చని ఆటోమొబైల్ డీలర్ల సంఘం (ఎఫ్ఏడీఏ) అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా అన్నారు. గత రెండేండ్లు కరోనా కారణంగా మార్కెట్లో స్తబ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది పూర్వవైభవం సంతరించుకోగలదన్న ఆశాభావాన్ని పరిశ్రమ వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగినట్టు డీలర్లు చెప్తున్నారు. ఈసారి రెండు రోజులు ధన్తేరాస్ శుభ ఘడియలు ఉండటం మార్కెట్కు కలిసొచ్చే అంశమేనని వారు అభిప్రాయపడుతున్నారు.