Gold Price | న్యూఢిల్లీ, మార్చి 30: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అధికమవడంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో దేశీయంగా అతి విలువైన లోహాల ధరలు పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.570 అధికమై రూ.51,470కి చేరుకున్నది. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,300 అధికమై రూ.67,250 పలికింది. కానీ, హైదరాబాద్లో మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల ధర రూ.100 తగ్గి రూ.47,650కి, 24 క్యారెట్ల ధర రూ.120 దిగి రూ.51,980గా నమోదయ్యాయి. కిలో వెండి మాత్రం రూ.72,100 వద్ద కొనసాగుతున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,921 డాలర్లు పలుకగా, వెండి 24.79 డాలర్ల వద్ద ఉన్నది.