బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. గత వారం తులం విలువ దాదాపు రూ.51 వేలకు చేరుకున్నది. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి ధర 1,900 డాలర్లను తాకింది. వడ్డీరేట్లను ఈ ఏడాది పలు దశల్లో పెంచనున్నట్టు ఫెడ్ రిజర్వ్ ప్రకటించడంతో ధరలు పరుగందుకున్నాయి. ఈక్విటీ, బాండ్ల మార్కెట్లలో పతనం కూడా ధర పెరగడానికి కారణమే. సాధారణంగా అనిశ్చితి మార్కెట్ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరుగుతూంటాయి. ఈ విషయం 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో, 2020 కరోనా లాక్డౌన్ సందర్భంగా రుజువైంది.
అలాగే యుద్ధం జరిగినా.. జరగకపోయినా యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పడూ బంగారం ధరలకు రెక్కలు సహజంగా వస్తాయి. కాబట్టి ఇప్పట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తప్పక కొనాల్సిన అవసరం ఉన్నవారు ఇప్పుడు కొంటేనే లాభదాయకమని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే గత మూడు వారాల్లో బంగారం ధర 6.55 శాతం ఎగబాకింది. టెక్నికల్గా కూడా బ్రేకవుట్ జరిగింది. గ్లోబల్ మార్కెట్లో ఈ వారంలోనూ 1,900 డాలర్లకు ఎగువన ముగిస్తే మళ్లీ క్రితం గరిష్ఠ స్థాయి 2,075 డాలర్లకు చేరుకోవచ్చు. అంటే మరో 8-9 శాతం మేర పెరగడానికి అవకాశాలున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో రూ.56,000 లక్ష్యంగా బంగారం ధరలు కదిలే అవకాశం ఉన్నది.