Gold Rate | బంగారం ధరలు సరికొత్త శిఖరాలను చేరుతున్నాయి. అమెరికా-చైనా మధ్య ప్రతీకార సుంకాల వార్తో ప్రపంచ మార్కెట్లో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది అక్షయ తృతీయ నాటికి తులం బంగారం రూ.లక్ష మార్క్ని దాటే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం గోల్డ్ రూ.96వేలకు ఎగువన ట్రేడ్ అవుతున్నది. గత ఏడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధర 32శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి పసిడి ధర పెరుగుతూ వస్తుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రతి మూడురోజులకోసారి సరికొత్త రికార్డులను తాకుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.లక్ష దిశగా పయనిస్తున్నది.
ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా గోల్డ్ రేట్ రూ.లక్ష మార్క్ని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం బంగారం ఒకే రోజు రికార్డుస్థాయిలో రూ.6,250 పెరిగి తొలిసారిగా రూ.96వేలు దాటింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో వాణిజ్య యుద్ధం భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడికి సురక్షితంగా భావించే బంగారానికి మరింత డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు బంగారం 22శాతం.. దాదాపుగా రూ.17వేలు పెరిగింది. ఇక భారతీయులు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఏప్రిల్లో రిటైల్ వ్యాపారుల నుంచి రిటైల్ కస్టమర్స్ వరకు భారీ కొనుగోళ్లు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ వస్తున్నది. ఆ తర్వాత వివాహాలకు శుభముహూర్తాలు సైతం మొదలవనున్నాయి. దాంతోనూ ధరలు పైకి కదిలే అవకాశాలున్నాయి. మే 10, 2024న అక్షయ తృతీయ రోజున బంగారం ధర 10 గ్రాములకు రూ.73వేలు ధర పలకగా.. ప్రస్తుతం ఈ ధర రూ.96వేలకుపైగా పలుకుతున్నది. ఇటీవల డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి సైతం మెరుగైంది. డాలర్పై ఒత్తిడి కారణంగా గోల్డ్ ధర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆరేళ్లలో బంగారం తనపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు మూడురెట్లు రాబడిని ఇచ్చింది.
2019లో అక్షయ తృతీయ రోజున తులం బంగారం రూ.31,729గా ఉన్నది. 2020 అక్షయ తృతీయ రోజున 32 శాతం పెరుగుదలతో రూ. 46వేలు దాటింది. 2021లో 2.5 శాతం పెరుగుదలతో రూ. 47వేలు దాటిన పసిడి.. 2022లో 6శాతం పెరుగుదలతో తొలిసారిగా 10 గ్రాములకు రూ. 50వేల మార్క్ను అధిగమించింది. ఇక 2023లో బంగారం 15 శాతం పెరిగి రూ.60వేలు, 2024లో 20 శాతం పెరుగుదలతో రూ.73వేలు దాటింది. గత పది సంవత్సరాల్లో బంగారం పెట్టిబడిదారులకు ఏటా పదిశాతం కంటే ఎక్కువగానే రాబడిని ఇచ్చింది. భవిష్యత్లోనూ వృద్ధి ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు.