Gold Price | న్యూఢిల్లీ, మార్చి 18: భారత్లో బంగారం ధర తొలిసారిగా రూ.60,000 స్థాయిని దాటి రికార్డు సృష్టించింది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమన్న ప్రభావంతో శనివారం ఇక్కడి స్పాట్ మార్కెట్లో పైకి ఎగిసింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ.1,630 పెరిగి రూ. 60,320 వద్ద నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ఇదే స్థాయిలో పెరుగుదల సంభవించింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడిన బ్యాంకింగ్ సంక్షోభం పసిడిని పరుగులు తీయించింది. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారం కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎగబడటంతో అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్సు పుత్తడి ధర వేగంగా 2,000 డాలర్ల స్థాయిని సమీపించింది. ఒక్క ఉదుటన 70 డాలర్లు పెరిగి 1,993 డాలర్ల వద్ద నిలిచింది. కొవిడ్-19 పెచ్ఛరిల్లిన సందర్భంగా 2020 ప్రధమార్థంలో పెరిగిన తీరులోనే మూడేండ్ల తర్వాత ప్రస్తుతం బంగారం పరుగు కొనసాగింది. ఒకే వారంలో 5.6 శాతం పెరిగింది. 2020 మార్చి తర్వాత ఒకవారంలోనే ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రధమం. అలాగే 2022 ఏప్రిల్ తర్వాత ప్రపంచ మార్కెట్లో పుత్తడి గరిష్ఠ ధర ఇదే. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్చి 22 నాటి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్పెడుతుందన్న ఆశలు కూడా పుత్తడి ర్యాలీకి కారణమని బులియన్ ట్రేడర్లు అంటున్నారు. వాస్తవానికి యూఎస్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతపడక ముందు… ఫెడ్ వడ్డీ రేట్లను అరశాతం వరకూ పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.
అంతర్జాతీయ ట్రెండ్ను ప్రతిబింబిస్తూ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర కేవలం 10 రోజుల్లో రూ.5,000 వరకూ పెరిగింది. మార్చి 9న రూ.55,530 వద్దనున్న ధర 18కల్లా రూ.60,320 వద్దకు చేరింది. తాజాగా 22 క్యారెట్ల ధర రూ.1,500 అధికమై రూ.55,300 పలికింది. మార్చి 9న దీని ధర రూ. 50,900. పుత్తడి పెరిగినంత స్థాయిలో కాకపోయినా వెండి ధర కూడా ర్యాలీ జరిపింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,300 మేర పెరిగి రూ. 74,400 వద్దకు చేరింది.
అమెరికా, యూరప్ల్లో బ్యాంకింగ్ సంక్షోభం ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదని, దీంతో బులియన్ మార్కెట్లో పుత్తడి పెరుగుదల వచ్చేవారంలో సైతం కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. శుక్రవారం రాత్రి మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో రూ.59,430 వద్ద నిలిచిన 10 గ్రాముల పుత్తడి వచ్చే వారంలో రూ.60,000 స్థాయిని అధిగమిస్తుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా చెప్పారు. న్యూయార్క్లో ఇది 2,000 డాలర్లను దాటుతుందన్నారు. ఈ ఏడాది రాబడి విషయంలో ఇతర అన్ని అసెట్ సాధనాల్ని (షేర్లు, బాండ్లు) పుత్తడి అధిగమించిందని, ఈ ఏడాది ఇప్పటివరకూ 8 శాతం లాభాల్ని ఇచ్చిందని, ఒక్క మార్చి నెలలోనే 6.51 శాతం పెరిగిందని గుప్తా వివరించారు. ఈ వారం వెండి, బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ నృపేంద్ర యాదవ్ అంచనా వేశారు. అయితే ఎంసీఎక్స్లో ఇప్పటికే పుత్తడి రూ.59,000 స్థాయిని అధిగమించినందున, ఈ వారం ప్రారంభంలో మరింతగా పెరగవచ్చన్న సంకేతాలు కన్పిస్తున్నాయని అన్నారు.