Gold Rates | భారత్ బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ రూ.50 వేల మార్కును దాటేసింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు పెంచేయడం.. అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ భారీగా పతనం కావడం బంగారం ధర పెరుగుదలకు కారణమైందని తెలుస్తున్నది. గురువారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల తులం బంగారం ధర రూ.442 పెరిగి రూ.50,399కి చేరుకున్నది. బుధవారం బులియన్ మార్కెట్ ట్రేడింగ్ ముగింపులో తులం బంగారం ధర రూ.49,957 వద్ద నిలిచింది.
మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.558 ఎక్కువై రూ.58,580లకు పెరిగింది. బుధవారం ట్రేడింగ్ ముగింపులో కిలో వెండి ధర రూ.58,022గా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1677 డాలర్ల వద్ద ట్రేడ్ కాగా, ఔన్స్ వెండి ధర 19.69 డాలర్లు పలికింది.
మరోవైపు అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ మరో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. గురువారం ఫారెక్స్ మార్కెట్ అంతర్గత ట్రేడింగ్లో ఒకానొక దశలో 1.24 శాాతం పతనమై రూ.80.91కి పతనమైంది. ముగింపు దశలో 90 పైసల నష్టంతో రూ.80.86 వద్ద ముగిసింది. డాలర్ మీద రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠం ఇదే. అమెరికా ఫెడ్ రిజర్వు 75 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక ముందు మరికొన్నిసార్లు వడ్డీరేట్లు పెంచనున్నట్లు సంకేతాలిచ్చింది.
దేశీయంగా మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర రూ.50 వేల మార్క్ దిగువకు పడిపోయింది. ఇది ఏడు నెలల కనిష్ఠ స్థాయి. 0.25 శాతం ధర తగ్గి రూ.49,312 కోట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర 0.4 శాతం పతనంతో రూ.57,059 లకు చేరుకున్నది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 20 ఏండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది.