Dhanteras Sales | ధంతేరాస్ సందర్భంగా ఈ ఏడాది బంగారం, బంగారం ఆభరణాల కొనుగోళ్లు అదరగొట్టాయి. ఎన్నడూ లేని విధంగా ధంతేరాస్ శనివారం నుంచి ఆదివారం వరకు కొనసాగడంతో గతేడాదితో పోలిస్తే బంగారం, బంగారం ఆభరణాలు, బంగారం నాణాల కొనుగోళ్లు 35 శాతం పెరుగుతాయని జ్యువెల్లరీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం టీ-20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్తో టీం ఇండియా మ్యాచ్ తర్వాత సేల్స్ పెరిగాయని ఆభరణాల వ్యాపారులు తెలిపారు. ధరలు అధికంగా ఉన్నా బంగారం కొనుగోలు దారులు వెనుకడుగు వేయలేదని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం పది గ్రాముల బంగారం ధర రూ.50,139 పలికింది. గతేడాది ఢిల్లీలో ధంతేరాస్ సందర్భంగా తులం బంగారం ధర రూ.47,644 గా రికార్డయింది. బంగారం, వెండి ఆభరణాలు మాత్రమే కాక వాహనాలు, ఇతర ముఖ్యమైన వస్తువుల విక్రయాలు జరిగాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ చైర్మన్ ఆశీష్ పెథే మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధంతేరాస్ సేల్స్ 10-15 శాతం పెరుగుతాయని అంచనా వేశారు.
ప్రపంచ స్వర్ణ మండలి భారత్ సీఈవో సోమసుందరం పీఆర్ మాత్రం బంగారం, బంగారం ఆభరణాల విక్రయాలు ఈ ఏడాది 15-25 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల నుంచి ధంతేరాస్ వరకు బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 25-30 శాతం అమ్మకాలు పెరుగుతాయని మహారాష్ట్ర కేంద్రంగా పని చేస్తున్న పీఎన్జీ జ్యువెల్లర్స్ చైర్మన్ సౌరబ్ గాడ్జిల్ చెప్పారు. ఈ ఏడాది 80 శాతం సేల్స్ బంగారం ఆభరణాలేనని, మిగతా బంగారం విక్రయాలు జరిగాయన్నారు.
పీఎం షా జ్యువెల్లర్స్ ఎండీ దినేష్ జైన్ మాట్లాడుతూ కొనుగోలు దారుల నుంచి బంగారానికి అసాధారణమైన డిమాండ్ ఉందన్నారు. ఈ ఏడాది 40-45 శాతం గిరాకీ ఉండొచ్చునని అంచనా వేశారు. ఆదివారం అర్థరాత్రి వరకు జ్యువెల్లరీ షాపులు తెరిచే ఉంచనున్నట్లు ఆయా దుకాణాల యజమానులు తెలిపారు. ప్రీ-వెడ్డింగ్ కొనుగోళ్లతోపాటు ఈసారి గోల్డ్ జ్యువెల్లరీ, బంగారం నాణాలు కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు.
బంగారంతోపాటు మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండాయ్, కియా, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కార్ల సంస్థలు ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన మోడల్ కార్ల డెలివరీ ప్రారంభించాయి. ధంతేరాస్ రెండు రోజుల్లో 21 వేల కార్లు డెలివరీ చేయొచ్చునని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పది శాతానికి పైగా సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయితే, 2018, 2019 కంటే తక్కువ సేల్స్ ఉండొచ్చునన్నారు.
ధంతేరాస్ రెండు రోజుల కొనుగోళ్లలో సుమారు రూ.45 వేల కోట్ల బిజినెస్ జరిగిందని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) అంచనా వేసింది. ఇందులో రూ.25 వేల కోట్ల విలువైన జ్యువెల్లరీ సేల్స్ ఉంటాయని తెలిపింది. మిగతా రూ.20 వేల కోట్లలో ఆటోమొబైల్స్, కంప్యూటర్లు, కంప్యూటర్ బేస్డ్ వస్తువులు, ఫర్నీచర్, గృహోపకరణాలు, స్వీట్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని కెయిట్ తెలిపింది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా రూ.1.5లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.