న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) జనవరి నెలల్లో భారీ మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించాయి. 2024 జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో మదుపుదారులు ఒక్కసారిగా రూ.657 కోట్లు ఇన్వెస్ట్చేసినట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం 2023 డిసెంబర్లో ఈ పెట్టుబడులు రూ. 88.3 కోట్లే. ద్రవ్యోల్బణం పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారని విశ్లేషకులు తెలిపారు.
జనవరిలో జరిగిన పెట్టుబడులతో గోల్డ్ ఫండ్స్ నిర్వహించే ఆస్తుల విలువ డిసెంబర్తో పోలిస్తే రూ. 27,336 కోట్ల నుంచి రూ.27,778 కోట్లకు చేరాయి. 2023 డిసెంబర్ తొలినాళ్లలో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,100 డాలర్లస్థాయిని దాటిన తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. రూపాయిల్లో బంగారం గత ఏడాదికాలంగా మంచి రాబడులే ఇచ్చినప్పటికీ, ఈక్విటీలతో పోలిస్తే తక్కువేనని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెల్విన్ శాంటారిటా చెప్పారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గుముఖంపడితే బంగారం జోరుగా పెరుగుతుందన్న అంచనాలతో కొంతమంది ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడికి మొగ్గుచూపుతున్నారని వివరించారు. 2023 మొత్తం సంవత్సరంలో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.2,920 కోట్ల నిధులు తరలివచ్చాయి. 2022లో వచ్చిన పెట్టుబడులకంటే రూ.459 కోట్లు అధికంగా ఆకర్షించాయి.
గోల్డ్ ఈటీఎఫ్ల్లో యూనిట్ల రూపంలో ఇన్వెస్టర్లు మదుపు చేసే నిధుల్ని ఆ ఈటీఎఫ్లు తిరిగి బులియన్ మార్కెట్లో బంగారాన్ని కొని వాల్ట్ల్లో నిల్వ చేస్తాయి. ఈ యూనిట్లను డిజిటల్ రూపంలో ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో జమచేస్తారు. లేదా కోరుకున్నవారికి పత్రంగా అందిస్తారు. ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ ఒక గ్రాము పూర్తి స్వచ్ఛతగల బంగారానికి సమానం. దేశంలో భౌతిక బంగారం ధర ఆధారంగా గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడవుతుంది. ఎప్పుడు కావాలంటే ఆ సమయంలో వీటిని విక్రయించుకోవచ్చు.
అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల్ని మించి పెరిగిందన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర హఠాత్తుగా పతనమయ్యింది. మంగళవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి స్పాట్ మార్కె ట్లో ఔన్సు బంగారం ధర 28 డాలర్ల మేర క్షీణించి 1,993 డాలర్ల వద్దకు పడిపోయింది. ఒకే రోజున ధర 1.3 శాతం మేర పతనంకావడం గత రెండు నెలల్లో ఇదే ప్రధమం. ప్రపంచ ట్రెండ్ను అనుసరిస్తూ దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.600 తగ్గి (0.96 శాతం) రూ.61,500 వద్దకు దిగింది. రూపాయి క్షీణించిన ప్రభావంతో ప్రపంచ మార్కెట్తో పోలిస్తే ఎంసీఎక్స్లో ధర తక్కువ తగ్గింది. ఆఫ్షోర్ మార్కెట్లో డాలరు ఇండెక్స్ 104.6 స్థాయికి పెరిగిన నేపథ్యంలో రూపాయి మారకపు విలువ 10 పైసలు పడిపోయింది. ఇదే ట్రెండ్ అమెరికా మార్కెట్లో కొనసాగితే బుధవారం మన దేశంలోని స్పాట్ మార్కెట్లో సైతం పుత్తడి ధర 62, 500 దిగువకు తగ్గే అవకాశం ఉంటుం ది. మంగళవారం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.62,840 వద్ద ముగిసింది.