Gold Rate | న్యూఢిల్లీ, మార్చి 27: కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం, గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేయడంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో తులం బంగారం ధర రూ.640 దిగొచ్చి రూ.59,220 స్థాయికి పడిపోయింది. అంతకుముందు ఇది రూ.59, 860గా ఉన్నది. బంగారంతోపాటు వెండి మరింత తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.700 దిగొచ్చి రూ.70,140కి పడిపోయింది.
ఇటు హైదరాబాద్లోనూ రూ.150 తగ్గిన 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.59,690కి పడిపోగా, రూ.140 తగ్గిన 22 క్యారెట్ల ధర రూ.54,710 వద్దకు చేరుకున్నది. కిలో వెండి ధర యథాతథంగా రూ.76 వేల వద్ద కొనసాగుతున్నది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను బంగారం నుంచి ఇతర వాటికి మళ్లించడంతో ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,970 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా..వెండి 23.10 వద్ద ట్రేడ్ అవుతున్నది.