న్యూఢిల్లీ, మే 24: బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.900 తగ్గి రూ.73 వేల దిగువకు చేరుకున్నది. చివరకు రూ.72,650 వద్ద ముగిశాయి. గురువారం పుత్తడి రూ.1,050 తగ్గిన విషయం తెలిసిందే. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే రూ.2 వేల వరకు తగ్గినట్లు అయింది. పసిడితోపాటు వెండి రూ.500 దిగొచ్చి రూ.92,100గా నమోదైంది.
అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనావేసిన దానికంటే అధికంగా నమోదవడం, ఇప్పట్లో ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను పసిడి నుంచి ఈక్విటీలోకి తరలించడంతో ధరలు భారీగా తగ్గుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ వారంలో బంగారం ధర రూ.2,800 తగ్గినట్లు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 35 డాలర్లు తగ్గి 2,340 డాలర్ల వద్దకు దిగొచ్చింది.