న్యూఢిల్లీ, మార్చి 25: దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.4,900 లేదా 3.38 శాతం ఎగిసి రూ.1,49,700 (అన్ని పన్నులు సహా) పలికింది. కిలో వెండి విలువ కూడా రూ.11,250 లేదా 4.89 శాతం ఎగబాకి రూ.2,41,250 (అన్ని పన్నులతో కలిపి)గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు ప్రస్తుత ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ తీవ్రత తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చింది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్తో యుద్ధానికి 5 రోజులపాటు విరామం ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు శాంతియుతంగానే ముగుస్తాయన్న ఆశాభావం అంతటా నెలకొన్నది. దీంతో ఇన్నాళ్లూ గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అశాంతి కారణంగా విజృంభించిన ముడి చమురు ధరలు సైతం దిగొస్తున్నాయి. ఫలితంగా గత 3 వారాలుగా తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లు, గోల్డ్పై నుంచి డాలర్ల వైపునకు మళ్లించిన మదుపరులు.. ఇప్పుడు తిరిగి స్టాక్, పసిడి వైపునకు తెస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా రెండు రోజులపాటు అటు స్టాక్స్, ఇటు బులియన్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం బంగారం ధర రూ.3,450 పుంజుకొని రూ.1,34,450 వద్ద నిలిచింది. అంతకుముందు వరుసగా వారం రోజులపాటు ధరలు క్షీణిస్తూపోయిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇక మళ్లీ ధరలు పరుగులు పెట్టడం ఖాయమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడి, భారత్కు ముడి చమురు, గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వస్తే.. రేట్లు మున్ముందు బాగానే పెరుగుతాయన్న అంచనాలున్నాయి మరి. అయితే మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపనకు ఆటంకం ఏర్పడితే మాత్రం గోల్డ్, సిల్వర్పై ఇన్వెస్టర్లలో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుందని, ధరలు పడిపోయే వీలుందని కూడా అంటున్నారు. కాల్పుల విరమణ కోసం అమెరికా నుంచి 15 షరతులతో కూడిన ప్రతిపాదనలు ఇరాన్కు రావడమే కారణం.
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 82.17 డాలర్లు లేదా దాదాపు 2 శాతం ఎగిసి 4,556.55 డాలర్లకు చేరింది. సిల్వర్ వాల్యూ కూడా 2 శాతం బలపడి ఔన్స్ 72.67 డాలర్లుగా నమోదైంది. ఇదిలావుంటే ఫ్యూచర్ మార్కెట్లోనూ ధరలు పరుగందుకున్నాయి. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై ఏప్రిల్ కాంట్రాక్ట్కుగాను 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.5,091 పెరిగి రూ.1,44,003 పలికింది. అంతర్జాతీయంగా 157.9 డాలర్లు ఎగిసి 4,559.9 డాలర్లుగా నమోదైంది.
దేశ ప్రజలు, ఆలయాల వద్ద 50వేల టన్నుల బంగారం ఉందని, దీని విలువ కనీసం 10 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి అన్నారు. అయితే వృథాగా పడిఉన్న ఈ పసిడి అంతా ఆర్థిక వ్యవస్థలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దానివల్ల విదేశాల నుంచి పుత్తడిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదని, దీంతో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్)పై ఒత్తిడి కూడా తగ్గుతుందని వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఈవెంట్కు హాజరైన మరికొందరు సీనియర్ మార్కెట్ అధికారులూ దీన్ని సమర్థించారు. ఇండ్లు, ఆలయాల్లో భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని బయటకు తేగలిగితే.. దేశ ఆర్థిక వృద్ధికి అది ఎంతో దోహదం చేయగలదని స్పష్టం చేశారు.