Gold Rates | పండుగల సీజన్ వచ్చేసింది. పెండ్లిళ్ల సీజన్ రాబోతోంది. అయినా బంగారం ధరల్లో పరుగులు మాత్రం లేవు.గత నెల 20 నుంచి పసిడి విలువ రోజుకింత చొప్పున పడిపోతూనే ఉన్నది. దీంతో గడిచిన 10 ట్రేడింగ్ దినాల్లోతులం రేటు రూ.2,500 వరకు క్షీణించింది.మరోవైపు వెండి ధరలూ ఇదే బాటలో నడుస్తున్నాయి. కిలో వెండి రేటు ఈ వారం, 10 రోజుల్లో రూ.3,000 వరకు పతనమైంది. అటు సాధారణ కొనుగోలుదారులు, ఇటు పారిశ్రామిక వినియోగదారుల నుంచి డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణమన్న విశ్లేషణలువినిపిస్తున్నాయిప్పుడు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశీయ మార్కెట్లో గత వారం, పది రోజులుగా పసిడి జిలుగులు, వెండి వెలుగులు ఏమీ కనిపించడం లేదు. సాధారణంగా పండుగలు, పెండ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఇంకా కానరావడం లేదుమరి. తగ్గుతున్న ధరలకు, పడిపోతున్న డిమాండ్కు ఇది అద్దం పడుతున్నది. మున్ముందూ మార్కెట్లో ఇదే మందగమనం ఆవరించి ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తుండగా, ఇప్పట్లో ధరలు పెరిగే వీలు దాదాపుగా ఉండకపోవచ్చన్న అంచనాలూ కొనుగోలుదారులను వేచిచూసే ధోరణిలోకి నెడుతున్నాయి. ఆగితే ధరలు తగ్గి మరింత లాభాన్ని పొందవచ్చన్న తీరు కస్టమర్లలో ఉంటున్నది.
అటు రూ.660.. ఇటు రూ.2,000
మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో తులం పసిడి రేటు రూ.58 వేల మార్కు దిగువకు, కిలో వెండి విలువ రూ.74,000 కిందికి చేరాయి. ఈ ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.57,380కి దిగొచ్చింది. 22 క్యారెట్ రేటు సైతం రూ.600 క్షీణించి రూ.52,600లకు పరిమితమైంది. ఇలా గడిచిన పది రోజుల్లో తులం ధర రూ.2,500 వరకు దిగిరావడం గమనార్హం. మరోవైపు కస్టమర్ల ఆదరణ లేక మార్కెట్లో కిలో వెండి ధర కూడా గత పది దినాల్లో రూ.3,000 వరకు తగ్గడం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే రూ.2,000 దిగింది. అటు ఢిల్లీ మార్కెట్లోనూ 10 గ్రాముల పుత్తడి రూ.650, కిలో వెండి ధర రూ.1,800 చొప్పున క్షీణించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ ధర 1,825 డాలర్ల వద్ద, వెండి ధర 21.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. డాలర్ ఇండెక్స్ పెరుగుతున్న నేపథ్యంలోనే గోల్డ్ రేట్లు పడిపోతున్నాయని గ్లోబల్ మార్కెట్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు.