హైదరాబాద్, ఏప్రిల్ 13: బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలోనే ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉండటంతో రికార్డు స్థాయికి చేరుకున్న ధరలు తగ్గుముఖం పట్టాయి. అధిక ధరల కారణంగా దేశీయంగా కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని బులియన్ వర్తకులు వెల్లడిస్తున్నాయి.
దీంతో హైదరాబాద్ బులియన్ మార్కె ట్లో 22 క్యారెట్ తులం బంగారం ధర రూ.700 దిగొచ్చి రూ. 67,200 నుంచి రూ. 66,500కి తగ్గింది. అలాగే 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.760 తగ్గి రూ.73 వేల దిగువకు పడిపోయింది. చివరకు బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి తులం పుత్తడి ధర రూ.72,550కి తగ్గింది. పసిడితోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి రూ.1,000 తగ్గి రూ. 90 వేల మార్క్ నుంచి రూ.89 వేల కు దిగొచ్చింది.