World Bank on Poverty | వచ్చే ఎనిమిదేండ్లలో తీవ్రమైన దారిద్య్రాన్ని నిర్మూలించలేమని ప్రపంచ బ్యాంక్ తేల్చి చెప్పింది. కరోనా మహమ్మారి వల్ల పేదలే ప్రభావితం అయ్యారని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ చెప్పారు. అంతర్జాతీయంగా ఆర్థిక, ఆదాయ అసమానతలు పెరిగాయన్నారు. పేద దేశాల్లో పరిస్థితులు బాగా దిగజారినా, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. వర్ధమాన దేశాలు మాత్రం చెప్పుకోదగ్గ వృద్ధి సాధించాయన్నారు. కొవిడ్ వేళ భారత్.. తమ పౌరులకు డిజిటల్ వేదికగా ఎంతో సేవ చేసిందన్నారు.
కరోనా టైంలో పేదలు, బడుగు వర్గాల ప్రజలకు భారత్ విశేష సాయం అందించిందని డేవిడ్ మాల్పాస్ ప్రశంసించారు. 69 శాతం మంది పట్టణ వాసులు, 85 శాతం మంది గ్రామీణులకు ఆహారం, నగదు సాయం అందజేసిందని చెప్పారు. ఇందుకు ఆన్లైన్ వేదికలు ఎంతో ఉపకరించాయన్నారు. ప్రత్యేకించి భారత్ అమలు చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని విదేశాలు సైతం అనుసరించాలని పేర్కొన్నారు. అప్పుడు అర్హులు, అవసరమైన లబ్ధిదారులకే లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
సౌతాఫ్రికాలో 2.9 కోట్ల మందికి 600 కోట్ల డాలర్ల విలువ గల భారీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అమలు చేశామని డేవిడ్ మాల్పాస్ తెలిపారు. బ్రెజిల్లో ఆర్థిక మందగమనం నెలకొన్నా 2020లో డిజిటల్ నగదు బదిలీ పథకం ద్వారా పేదరికాన్ని తగ్గించగలిగినట్లు చెప్పారు.