Go First | ఆపరేషన్స్లో సమస్యల వల్ల ప్రముఖ విమానయాన సంస్థ ‘గోఫస్ట్’ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెలాఖరు వరకు అన్ని విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గత మే నెలలో గోఫస్ట్ ‘స్వచ్ఛంద దివాళా ప్రక్రియ’ దాఖలు చేసిన సంగతి అందరికీ విదితమే. తదుపరి తమ దివాళా పిటిషన్ త్వరితగతిన పరిష్కరించాలని, కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అనుమతించాలని కూడా పిటిషన్ వేసింది. త్వరలో విమాన సర్వీసులకు టికెట్ బుకింగ్స్ ప్రారంభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది గోఫస్ట్.
ఇదిలా ఉంటే.. గో ఫస్ట్’పై ఐర్లాండ్ విమానాల లీజు సంస్థ ‘ఏసీజీ ఎయిర్ క్రాఫ్ట్’ న్యాయస్థానంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాము లీజుకిచ్చిన విమానాల్లో విడి భాగాలు కనిపించడం లేదని తెలిపింది. గోఫస్ట్ సంస్థకు విమానాలు లీజుకు ఇచ్చిన పలు సంస్థలు కూడా న్యాయస్థానాల తలుపు తట్టినా.. ఆ సంస్థ ‘దివాళా ప్రక్రియ’ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో గోఫస్ట్ ఆస్తులు జప్తు చేయడం వల్ల 50కి పైగా ఎయిర్ బస్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
రాఖీ పౌర్ణమి, గణేశ్ చతుర్థి పండుగలు రానుండటంతో గోఫస్ట్ సంస్థ యాజమాన్యం తమ సంస్థ ఉద్యోగులకు రిలీఫ్ కల్పించింది. జూన్ నెల వేతనాలను వారి ఖాతాల్లో జమ చేసింది. తక్షణ ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల రుణాలు వచ్చాయి. ఈ రుణంతో విమానాల పార్కింగ్, ఎయిర్ పోర్ట్ కాస్ట్, ఉద్యోగుల వేతనాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, విమానాల మెయింటెనెన్స్ తదితర పనులకు గోఫస్ట్ వినియోగించనున్నది సమాచారం.