న్యూఢిల్లీ, ఆగస్టు 20: జీఎమ్మార్ గ్రూప్ ప్రస్తుతం అమలు జరుపుతున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రాజెక్టు 2022 సెప్టెంబర్కల్లా పూర్తవుతుంది. దాంతో ఈ విమానాశ్రయం 3.5 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించే సామర్థ్యానికి చేరుతుంది. తాజాగా విడుదల చేసిన గ్రూప్ వార్షిక నివేదికలో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీఎం రావు హైరదాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రాజెక్టు ప్రణాళికను తెలిపారు. వివరాలివి…
నిర్వహణలో 4 ఎయిర్పోర్టులు
జీఎమ్మార్ గ్రూప్ ఎయిర్పోర్టుల వ్యాపారంలో భాగంగా ప్రస్తుతం నాలుగు విమానాశ్రయాల్ని నిర్వహిస్తున్నది. అవి..రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ, బీదర్ ఎయిర్పోర్ట్, కర్నాటక, మక్టన్సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పిలిఫ్పీన్స్.
నిర్మాణంలో ఉన్నవి: మోపా ఎయిర్పోర్ట్, గోవా, క్రెటె ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీస్
ఢిల్లీ ఎయిర్పోర్ట్: ఈ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం ఎయిర్సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెర్మినల్ కెపాసిటీ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఏడాదికి 10 కోట్ల మంది ప్రయాణీకుల్ని చేరవేసేలా సామర్థ్యాన్ని పెంచే ఈ ప్రాజెక్టు 2023 జూన్కల్లా పూర్తవుతుంది.ఈ విస్తరణ ప్రాజెక్టు కోసం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాలపరిమితి ముగియనున్న 28.9 కోట్ల డాలర్ల బాండ్ల చెల్లింపుల కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్ తాజాగా విదేశాల్లో గ్రీన్బాండ్లు జారీచేసి 45 కోట్ల డాలర్లను సమీకరించింది.
గోవా ఎయిర్పోర్ట్: ఈ విమానాశ్రయానికి లభించిన పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నెల్ ఇచ్చిన తర్వాత 2020 ఫిబ్రవరిలో నిర్మాణ పనులు పునర్ప్రారంభమయ్యాయి. 2022 ఆగస్టులో ఈ ఎయిర్పోర్ట్ కార్యకలాపాల్ని మొదలుపెడుతుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2020 లో ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఎర్త్వర్క్స్తో సహా ఇతర అభివృద్ధిపనులు మొదలయ్యాయి.
పెట్టుబడులు 20వేల కోట్లు
హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో సహా ప్రస్తుతం నిర్వహిస్తున్న విమానాశ్రయాల విస్తరణ, కొత్తవాటిని అభివృద్ధిపర్చడానికి భారీ విస్తరణ ప్రణాళికను అమలు జరుపుతోంది. ఇందుకోసం తాము రూ.20,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నామని జీఎమ్మార్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు.