హైదరాబాద్, ఫిబ్రవరి 14: జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.173.96 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.202.10 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతం తగ్గింది.
ఒకేసారి అధికంగా రూ. 183.12 కోట్ల చెల్లింపులు జరపడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు వెల్లడించింది. దీంట్లో నూతన కార్మిక చట్టం అమలు చేయడానికి ఒకేసారి రూ.69.65 కోట్ల నిధులు వెచ్చించినట్టు పేర్కొన్నారు. కంపెనీ ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. ఏడాది క్రితం రూ.2,748 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ.4,082 కోట్లకు చేరుకున్నది. నిర్వహణ ఖర్చు లు రూ.2,294 కోట్లకు చేరాయి.