Gautam Adani | అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో గౌతం అదానీ.. టాప్-10 ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు కోల్పోయారు. జనవరిలో 36 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను నష్టపోయిన గౌతం అదానీ.. ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద 84.4 బిలియన్ డాలర్లు అని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. 2022లో అత్యధికంగా వ్యక్తిగత సంపద 40 బిలియన్ డాలర్లు కూడబెట్టుకున్న పారిశ్రామికవేత్తగా కూడా ఆయన నిలిచారు. తాజా గణాంకాల ప్రకారం గతేడాది సంపాదించిన సొమ్ము కోల్పోయారు.
గౌతం అదానీ భారీగా వ్యక్తిగత సంపద కోల్పోయినా ఇప్పటికీ భారత్లోనే నంబర్ వన్ కుబేరుడిగానే కొనసాగుతున్నారు. ఆయన తర్వాత స్థానంలో మెక్సికో సంపన్నుడు కార్లోస్ స్లిమ్.. 13వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉన్నారు. ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 82.2 బిలియన్ డాలర్లు.
అదానీ గ్రూప్ స్టాక్స్ ట్రేడింగ్లో మోసాలు, అవకతవకలకు పాల్పడుతున్నదని న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న షార్ట్ షెల్లింగ్ సంస్థ.. హిండెన్బర్గ్ రీసెర్చ్ 32 వేల పదాలతో గతవారం నివేదిక సమర్పించింది. దీంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరిగిన ప్రతి రోజూ అదానీ గ్రూప్ సంస్థలు బిలియన్ల డాలర్ల సంపద కోల్పోతున్నాయి. దీంతో మూడు సెషన్లలో అదానీ గ్రూప్ సంస్థలు 25 శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.
గతేడాది పోర్టుల నుంచి ఎఫ్ఎంసీజీ, మైనింగ్, ఇంధనం తదితర రంగాల్లో దూసుకెళ్లడంతో ఆయన గ్రూప్ సంస్థల స్టాక్స్ ధరల్లో ర్యాలీ నమోదైంది. ఫలితంగా గతేడాది కొద్దికాలం పాటు ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానాన్ని ఆక్రమించారు. గౌతం అదానీ కంటే కుబేరుడిగా ఎలన్మస్క్ కొనసాగారు. ప్రస్తుతం బిల్ గేట్స్, జెఫ్బెజోస్, గూగుల్ కో-ఫౌండర్లు లారీ పేజ్-సెర్జెయ్ బ్రిన్ నిలిచారు.