న్యూఢిల్లీ, నవంబర్ 29: ఫోర్బ్స్ భారతీయ కుబేరుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. దేశంలోని టాప్-100 సంపన్నులతో తాజాగా విడుదలైన జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్ డాలర్లు)తో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రూ.7,10,723.26 కోట్ల తో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. మూడో స్థానంలో డీ-మార్ట్ అధినేత దమానీ రూ.2,22,908.66 కోట్లతో ఉన్నారు. రూ.15,350 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారితోనే ఈ జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది.
ఒక్క ఏడాదిలోనే రెట్టింపు
గౌతమ్ అదానీ సంపద కేవలం ఒక్క ఏడాదిలోనే రెట్టింపు కావడం గమనార్హం. గడిచిన ఏడాది కాలంలో అదానీ సంపద రూ.6 లక్షల కోట్లకుపైగా (75.2 బిలియన్ డాలర్లు) ఎగబాకడం విశేషం. ఇది ముకేశ్ అంబానీ సంపదకు దాదాపు దగ్గర్లో ఉండటం నిజంగా చెప్పుకోదగ్గ అంశమే. కాగా, అదానీ సంపద 2014 నుంచే గణనీయంగా పెరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా అదానీకి పేరున్న విషయం తెలిసిందే. ఇక 2014లోనే కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరిన సంగతీ విదితమే. ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుదుత్పత్తి, విద్యుత్తు పంపి ణీ, మీడియా, ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, సిమెంట్, వంటనూనెలు తదితర రంగాల్లో అదానీ వ్యాపార కార్యకలాపాలున్నాయి.