Adani Group | న్యూఢిల్లీ, ఆగస్టు 16: తీవ్ర రుణభారంలో ఉంటూనే వరుస టేకోవర్లు చేస్తున్న గౌతమ్ అదానీ గ్రూప్ ప్రమోటర్లు తాజాగా మరో కంపెనీలో కొంత వాటా విక్రయించారు. బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో పలు బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ పవర్లో 8.1 శాతం వాటాను రూ.9,000 కోట్లకు అదానీ కుటుంబం ఆఫ్లోడ్ చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫండ్ జీక్యూజీ పార్టనర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్తో పాటు గోల్డ్మాన్శాక్స్ జీక్యూజీ ఇంటర్నేషనల్, గోల్డ్మాన్ శాక్స్ ట్రస్ట్-2లు కలిసి 15.2 కోట్ల షేర్లను రూ.279.15 సగటు ధరపై కొనుగోలు చేశాయి. ఇది ఒకే కంపెనీ షేరులో స్టాక్ ఎక్సేంజీల్లో జరిగిన అతిపెద్ద లావాదేవీ అని పేర్కొన్నారు. బ్లాక్ డీల్స్ నేపథ్యంలో ఇంట్రాడేలో 5 శాతంపైగా పడిపోయిన అదానీ పవర్ చివరకు 2 శాతం నష్టంతో రూ. 279.90 వద్ద ముగిసింది.
అదానీ అవకతవకలపై యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరిలో నివేదిక విడుదల చేసిన తర్వాత గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లన్నీ నిట్టనిలువునా కుప్పకూలిన సంగతి తెలిసింది. ఈ గ్రూప్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, పలు రుణ చెల్లింపులు చేయాల్సిన సమయంలో హఠాత్తుగా జీక్యూజీ పార్టనర్స్ రంగంలోకి దిగింది. మార్చి నెలలో అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్తో సహా నాలుగు సంస్థల్లో రూ. 15,000 కోట్లకుపైగా పెట్టుబడి చేసి గౌతమ్ అదానీని తాత్కాలికంగా గట్టెక్కించింది. అటుతర్వాత జూన్ నెలలో మరో రూ.8,300 కోట్లు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్లో షేర్లు కొన్నది.
తాజా లావాదేవీతో అదానీ గ్రూప్లో జీక్యూజీ ఇప్పటివరకూ చేసిన పెట్టుబడుల మొత్తం దాదాపు రూ.30,000 కోట్లకు చేరింది. జీక్యూజీ పార్టనర్స్ వ్యవస్థాపకుడైన రాజీవ్ జైన్ ప్రవాస భారతీయుడు కావడం గమనార్హం. ఈ ఫండ్ ఆస్ట్రేలియా స్టాక్ ఎక్సేంజ్లో లిస్టయ్యింది. సిడ్నీ స్టాక్ ఎక్సేంజ్లో ఈ షేరు 1.58 ఆస్ట్రేలియన్ డాలర్ల వద్ద ముగిసింది. గత ఏడాదిలో ఇది 7 శాతంపైగా నష్టపోయింది. జీక్యూజీ పార్టనర్స్ ప్రస్తుత మార్కెట్ విలువ 4.68 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ.25,500 కోట్లు) కాగా, అంతకు మించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకే గ్రూప్లో రూ.33,000 కోట్లు పెట్టుబడి చేయడం ఆశ్చర్యంగా ఉందని మార్కెట్ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.