న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఈ ఏడాది ఆరంభంలో హిండెన్బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ.. తిరిగిప్పుడు పుంజుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్లూంబ ర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్-15 బిలియనీర్ల జాబితాలో మళ్లీ అదానీ చోటు దక్కించుకున్నారు. తాజాగా విడుదలైన లిస్టులో 82.50 బిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానంలో నిలిచారు. 91.4 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. అయితే ఇటు భారత్లో.. అటు ఆసియాలో ముకేశ్, అదానీలే ప్రస్తుతం అత్యంత ధనవంతులుగా ఉండటం విశేషం. తొలి రెండు స్థానాల్లో ఉన్న ఇరువురికి మధ్య 8.9 బిలియన్ డాలర్ల సంపదే వ్యత్యాసంగా ఉండటం గమనార్హం.
అదానీ స్టాక్స్ పరుగులు
స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. మదుపరులు ఎగబడిమరీ కొనేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ అదానీ సంపద వేగంగా పెరుగుతూపోతున్నది. మంగళవారం ఒక్కరోజే అదానీ సంపద 12.3 బిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. ఇక నిరుడు సెప్టెంబర్లో అదానీ సంపద ఏకంగా 150 బిలియన్ డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీని సైతం వెనక్కినెట్టి భారతీయ అత్యంత ధనవంతుడిగా స్థిరపడ్డారు.
అయితే అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందంటూ ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఓ సంచలన నివేదిక తీసుకొచ్చింది. దీంతో అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. సెబీ, సుప్రీం కోర్టు విచారణల్లో అలాంటిదేమీ లేదని దాదాపుగా తేలిపోవడంతో మదుపరులు తిరిగి అదానీ షేర్లలో పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిండెన్బర్గ్ రిసెర్చ్ రిపోర్టు విడుదలైన దగ్గర్నుంచి తొలిసారి బుధవారం అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లను తాకింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ర్టాల్లో బీజేపీ గెలవడం కూడా మార్కెట్లలో అదానీ షేర్లను ఆకర్షణీయం చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.