Air India | ఎయిర్ ఇండియా (ఏఐ) తీరుపై సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) సీరియస్ అయ్యింది. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్, భద్రత, రక్షణ, నాణ్యతా విభాగం అధిపతిలకు డీజీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 21నే వారికి నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. ఎయిర్ ఇండియా పైలట్ కాక్పిట్లోకి తన స్నేహితురాలిని ఆహ్వానించడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది డీజీసీఏ భద్రతా నిబంధనలకు వ్యతిరేకం అని స్పష్టం చేసింది. ఈ ఘటనపై విచారణలోనూ జాప్యం జరిగిందని డీజీసీఏ అధికారి తెలిపారు. 15 రోజుల్లో తమకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని, కానీ ఇప్పటివరకు ఎయిర్ ఇండియా నుంచి ఎటువంటి స్పందన లేదని ఆ అధికారి తెలిపారు.
ఎయిర్ ఇండియా విమానంలో ఒక పైలట్ తన స్నేహితురాలిని కాక్పిట్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రయాణ సమయం అంతా అక్కడే కూర్చోబెట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సదరు పైలట్.. విమానంలో తన స్నేహితురాలు ఉండటంతో అత్యుత్సాహం ప్రదర్శించాడని విమర్శలు వచ్చాయి. దుబాయ్లో విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే సదరు పైలట్.. తన స్నేహితురాలిని కాక్పిట్లోకి ఆహ్వానించడంతోపాటు ఢిల్లీకి చేరుకునే వరకు అంటే సుమారు మూడు గంటలు కాక్పిట్లోని ఫస్ట్ అబ్జర్వర్ సీటులోనే కూర్చున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
క్యాబిన్ సభ్యులు ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. తన స్నేహితురాలికి కాక్పిట్లోనే భోజనం అందించాలని, సకల మర్యాదలు చేయాలని సిబ్బందిని సదరు పైలట్ ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై అభ్యంతరం తెలిపిన సిబ్బంది పట్ల పైలట్ దురుసుగా ప్రవర్తించారని ఆ సదరు క్యాబిన్ సభ్యులు తన ఫిర్యాదులో వెల్లడించినట్లు సమాచారం.