హైదరాబాద్, ఆగస్టు 9: ఫ్రీడమ్ పేరుతో వివిధ రకాల వంటనూనెల్ని విక్రయించే జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్లో రూ. 2,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేయనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. కంపెనీ ప్రస్తుత ప్రమోటర్లు, షేర్హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా వారి వాటాల్లో కొంతశాతాన్ని విక్రయించేందుకు ఈ ఐపీవో జారీ అవుతున్నది. ప్రధాన ప్రమోటింగ్ సంస్థ గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్, ప్రమోటర్లయిన ప్రదీప్కుమార్ చౌదరి , అల్కా చౌదరి కొంత వాటాను విక్రయించనున్నారు. అలాగే షేర్హోల్డర్లయిన బ్లాక్రివర్ఫుడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ షేర్లను విక్రయిస్తాయి.
7 వేల కోట్లు దాటిన ఆదాయం
ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జెమినీ ఎడిబుల్స్ ఆదాయం 2019-20తో పోల్చితే రూ.6,500 కోట్ల నుంచి రూ. 7,766 కోట్లకు చేరింది. కంపెనీ నికరలాభం రూ.186 కోట్ల నుంచి రెండు రెట్లు పెరిగి రూ.571 కోట్లకు చేరింది. కంపెనీకి తూర్పు తీరంలోని కాకినాడ వద్ద రెండు, కృష్ణపట్నం వద్ద ఒకటి రోజుకు 2,615 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల రిఫైనింగ్ ప్లాంట్లున్నాయి. రోజుకు 3,988 మెట్రిక్ టన్నుల ప్యాకేజింగ్ సామర్థ్యం ఉంది. తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్నాటక, ఒడిసాలలో దాదాపు 640 పట్టణాల్లో ఫ్రీడమ్ ఉత్పత్తులు విక్రయమవుతున్నాయి.