ముంబై, జనవరి 25: ఉవ్వేత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడంతోపాటు ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గురువారం సూచీలు భారీగా నష్టపోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, ఐటీ సంస్థల నిరాశాజనక ఆర్థిక ఫలితాలు మార్కెట్లను నష్టాలవైపు నడిపించాయి.
ఒక దశలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగిస్తూ 71 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 359.64 పాయింట్లు నష్టపోయి 70,700.67 పాయింట్ల వద్ద ముగిసింది. 30 షేర్లలో 19 షేర్లు నష్టపోగా, కేవలం 11 షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోసూచీ నిఫ్టీ కూడా 101.35 పాయింట్లు కోల్పోయి 21,352.60 పాయింట్ల వద్ద నిలిచింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటం, కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రంగ షేర్లు కుదేలయ్యాయి.
కుప్పకూలిన టెక్ మహీంద్రా షేరు
నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో టెక్ మహీంద్రా షేరు కుప్పకూలింది. గత త్రైమాసికంలో సంస్థ నికర లాభం 60 శాతం క్షీణించి రూ.510 కోట్లకు పడిపోవడం మదుపరులను మెప్పించలేకపోయింది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో కంపెనీ షేరు ధర 6 శాతానికి పైగా నష్టపోయింది. బీఎస్ఈలో కంపెనీ షేరు 6.12 శాతం తగ్గి రూ.1,321.60 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ షేరు 5.89 శాతం పతనం చెంది రూ.1,325 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,407.73 కోట్లు కరిగిపోయి రూ.1,29,011.81 కోట్ల వద్ద నిలిచింది.