హైదరాబాద్, జూలై 7: కృత్రిమ మేధస్సుతో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ నూతన టెక్నాలజీతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ అన్నారు. హైదరాబాద్లో ‘అందరికి ఏఐ: ఉద్యోగాలు, అభివృద్ధి, అవకాశాలు అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ, ఆర్థిక సేవలు, విద్యా రంగాల్లో ఏఐ వినియోగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ నిపుణుల్లో 16 శాతం మందికి ఏఐపై మంచి పట్టువుందని, రాబోయే పదిహేను సంవత్సరాల్లో ఈ వాటా 20 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.