Indian Currency | ముంబై, మార్చి 22: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలవిల్లాడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్లో డాలర్తో పోల్చితే దేశీయ కరెన్సీ మారకం విలువ ఆల్టైమ్ కనిష్ఠానికి క్షీణించింది మరి. ఈ ఒక్కరోజే ఏకంగా 48 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 83.61 వద్ద నిలిచింది. వరుస నష్టాల నుంచి కాస్త కోలుకున్నదనుకునేలోపే.. మళ్లీ భారీ నష్టాన్ని చవిచూసింది. 8 రోజులపాటు ఏకధాటిగా దిగజారిన రూపాయి మారకం విలువ గురువారం 6 పైసలు పెరిగి ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే. అయితే డాలర్ ముందు నిలబడలేక తిరిగి 48 పైసలు కోల్పోయింది. ఒకానొక దశలోనైతే 52 పైసలు నష్టపోయి 83.65 వద్దకు దిగి ఆల్టైమ్ ఇంట్రా-డే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో దేశం నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయన్న అభిప్రాయాలు ఫారెక్స్ ట్రేడర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
కాగా, గత ఏడాది డిసెంబర్ 13న డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 83.40 స్థాయిని చేరి జీవనకాల కనిష్ఠాన్ని సృష్టించింది. ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయిని దాటి రూపీ నష్టాలను మూటగట్టుకున్నది. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లో ట్రేడై ఆకట్టుకున్న రూపీ.. సమయం గడుస్తున్నకొద్దీ పతనం దిశగానే పయనించింది. ఇదిలావుంటే రూపాయి విలువ ఇలాగే పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందన్న ఆందోళనలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తులు, సేవలు ఖరీదెక్కుతాయని, ఇది ద్రవ్యోల్బణానికి దారితీయగలదంటున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే వడ్డీరేట్లను అధిక స్థాయిలోనే ఉంచుతున్న ఆర్బీఐ.. మరికొంత కాలం కోతల జోలికి పోదని, అప్పుడు రుణ భారం పెరిగి అన్ని రంగాలు కుదేలవుతాయన్న అంచనాలున్నాయి.