న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: రియల్ రంగంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో విదేశీ పెట్టుబడిదారులు కేవలం 11 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వెస్టిన్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన 791.4 మిలియన్ డాలర్లతో పోలిస్తే 99 శాతం తగ్గాయని పేర్కొంది. మొత్తంగా ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు 552 మిలియన్ డాలర్లు వచ్చాయి.
ఏడాది క్రితం ఇదే సమయంలో వచ్చిన 1,238.3 మిలియన్ డాలర్ల(1.23 బిలియన్ డాలర్లు) కంటే ఇది 55 శాతం తగ్గాయి. జనవరి-మార్చి మధ్యకాలంలో 541.1 మిలియన్ డాలర్లు దేశీయ ఇన్వెస్టర్లు నిధులు చొప్పించారు. రియల్ ఎస్టేట్ రంగంపై దేశీయ పెట్టుబడిదారులు ఆశాభావంతో ఉండటంతో భారీగా నిధులు కుమ్మరించారని వెస్టిన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు. కానీ, అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటంతో విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజవేస్తున్నారన్నారు.