FDI | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్లో 13 శాతం క్షీణించి 32.03 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది (2022) ఇదే వ్యవధిలో 36.74 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. అయితే 2023 అక్టోబర్-డిసెంబర్లో ఎఫ్డీఐ గతంతో పోల్చితే 18 శాతం పెరిగి 11.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2022 అక్టోబర్-డిసెంబర్లో 9.83 బిలియన్ డాలర్లే. కానీ ఏప్రిల్-జూన్, జూలై-సెప్టెంబర్ త్రైమాసికాల్లో క్షీణత ప్రభావితం చేసినట్టు తాజా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అధిక వడ్డీరేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఎఫ్డీఐ పతనానికి కారణమేనన్న అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్లోకి వచ్చిన ఎఫ్డీఐ 22 శాతం పడిపోయి 46 బిలియన్ డాలర్లుగానే ఉన్న విషయం తెలిసిందే.
కంప్యూటర్ హార్డ్వేర్-సాఫ్ట్వేర్, ట్రేడింగ్, సేవలు, టెలికం, ఆటో, ఔషధ, రసాయన రంగాల్లో ఎఫ్డీఐలు దిగజారినట్టు తేలింది. నిర్మాణ రంగ కార్యకలాపాలు, అభివృద్ధి, విద్యుత్తు రంగాల్లోకి ఎఫ్డీఐ పెరిగినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే క్షీణత నమోదైనట్టు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) చెప్తున్నది. ఇదిలావుంటే నిరుడు ఏప్రిల్-డిసెంబర్లో ఈక్విటీ మార్కెట్లు, ఇతరత్రా పెట్టుబడులు కలుపుకొని దేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐని పరిగణనలోకి తీసుకుంటే 51.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2022 ఏప్రిల్-డిసెంబర్తో పోల్చితే దాదాపు 7 శాతం తగ్గాయి. నాడు 55.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్లో భారత్లోకి సింగపూర్ నుంచి వచ్చిన ఎఫ్డీఐలు పడిపోయాయి. అమెరికా, బ్రిటన్, సైప్రస్, యూఏఈ దేశాల నుంచీ తగ్గుముఖం పట్టా యి. ప్రధానంగా కేమన్ ఐస్లాండ్స్ నుంచి ఎఫ్డీఐలు 215 మిలియన్ డాలర్ల వద్దే ఉండగా, సైప్రస్ నుంచి వచ్చినవి 796 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. నిజానికి 2022 ఏప్రిల్-డిసెంబర్లో భారత్కు కేమన్ ఐస్లాండ్స్ నుంచి 624 మిలియన్ డాలర్లు, సైప్రస్ నుంచి 1.15 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చింది. అయితే మారిషస్, నెదర్లాండ్స్, జపాన్, జర్మనీ నుంచి ఎఫ్డీఐ రాక పెరిగింది.
2023 ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో ఆయా దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2022 ఇదే వ్యవధితో పోల్చితే పెరిగినట్టు తాజా గణాంకాల్లో కేంద్ర ప్రభు త్వం పేర్కొన్నది. గుజరాత్, జార్ఖండ్ రాష్ర్టాలకూ ఎఫ్డీఐలు చెప్పుకోదగ్గ రీతిలోనే వచ్చాయన్నది. అయితే రాష్ర్టాలవారీగా మహారాష్ట్రలోకి అత్యధికంగా 12.1 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చింది. మునుపు 10.76 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. కానీ గతంతో పోల్చితే కర్ణాటకకు 8.77 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హర్యానా రాష్ర్టాలూ ఎఫ్డీఐలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.