Ford | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ సైతం పొదుపు చర్యలు ప్రారంభించింది. ఆర్థిక సమస్యలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ కార్లవైపు మళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం ఇతర కార్ల తయారీ సంస్థలతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నది ఫోర్డ్.
ఈ క్రమంలో తమ సంస్థ కార్యకలాపాల నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు వచ్చే మూడేండ్లలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. వారిలో అత్యధికులు యూరప్ దేశాల వారే ఉన్నారు. వారిలో 2,300 మంది ఉద్యోగులు జర్మనీలో, బ్రిటన్లో 1300 మంది, యూరప్ దేశాల పరిధిలో 200 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. బ్రిటన్లోని ఫోర్డ్ ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోనున్నారు.
2035 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మళ్లాలని ఫోర్డ్ నిర్ణయించింది. ఈ ఏడాది చివరిలోగా తొలి యూరోపియన్-బిల్ట్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని ప్రకటించింది. యూరప్లో తమకు కార్ల తయారీ మరింత ఖర్చుతో కూడుకున్నదని తెలిపింది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు బదిలీ అవుతున్న నేపథ్యంలో.. 2025 నాటికి ఇంజినీరింగ్ విభాగంలో 2,800 మంది ఉద్యోగాలు తొలగించాలని ఫోర్డ్ లక్ష్యంగా పెట్టుకున్నది. యూరప్ వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 3,400 మంది తొలగించనున్నది. మరో వెయ్యి మందిని అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో తొలగిస్తామని తెలిపింది.
`ఇవి కఠిన నిర్ణయాలు, తేలిగ్గా తీసుకోకూడదు` అని యూరప్ ఫోర్డ్ మోడల్ జనరల్ మేనేజర్ మార్టిన్ శాండర్ తెలిపారు. `మా టీంలో అనిశ్చితి నెలకొంటుందని మేం గుర్తించాం. కొన్ని నెలల పాటు వారికి పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇస్తున్నా` అని పేర్కొన్నారు. యూరప్ వ్యాప్తంగా ఫోర్డ్లో 34 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. యూరప్ దేశాల్లో సొంతంగా, ఇతర సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్లు నిర్వహిస్తున్నది ఫోర్డ్.
పొదుపు చర్యల్లో భాగంగా భారత్ మార్కెట్ నుంచి ఫోర్డ్ నిష్క్రమించింది. తమిళనాడు, గుజరాత్లోని తమ ప్రొడక్షన్ యూనిట్లకు ఇతర ఆటోమొబైల్ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. గుజరాత్లోని ఫోర్డ్ ప్రొడక్షన్ యూనిట్ను టాటా మోటార్స్ సొంతం చేసుకున్నది.
బ్రిడ్జెండ్లో ఏర్పాటు చేసిన రెండేండ్లలోపే ఫోర్డ్ ఇంజిన్ ప్లాంట్ను మూసేసింది. ఫోర్డ్ బ్రిటన్ చైర్మన్ టిమ్ స్లాటర్ మాట్లాడుతూ యూరప్ దేశాల్లో మేం చాలా సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని చెప్పారు. ఉక్రెయిన్పై యుద్ధం దరిమిలా ఇంధన ధరలు పెరిగిపోయాయన్నారు. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెరిగాయన్నారు.