భారతీయ బిలియనీర్లలో రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారని ప్రముఖ ఫోర్బ్స్ సంస్థ ఇండియా తెలిపింది. 2023 ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితాను గురువారం రిలీజ్ చేసింది. ఫోర్బ్స్. ముకేశ్ అంబానీతోపాటు వంద మంది అగ్రశ్రేణి కుబేరుల్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, హెచ్సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్, ఓపీ జిందాల్ గ్రూప్నకు చెందిన సావిత్రి జిందాల్, అవెన్యూ సూపర్ మార్ట్స్ అధినేత రాధాకిషన్ ధమానీ తదితరులు ఉన్నారు.
ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 92 బిలియన్ డాలర్లు కాగా, గౌతం అదానీ 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో శివ్ నాడార్ సంపద 29.3 బిలియన్ డాలర్లు, సావిత్రి జిందాల్ 24 బిలియన్ డాలర్లు, రాధాకిషన్ దమానీ 23 బిలియన్ డాలర్లు, సైరస్ పూనావాలా 20.7 బిలియన్ డాలర్లు, హిందుజా ఫ్యామిలీ 20 బిలియన్ల డాలర్లు, దిలీప్ సంఘ్వీ 19 బిలియన్ డాలర్లు, కేఎం బిర్లా 17.5 బిలియన్ డాలర్లు, షాపూర్ మిస్త్రీ అండ్ ఫ్యామిలీ 16.9 బిలియన్ డాలర్లతో తర్వాతీ స్థానాల్లో నిలిచారు.
భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. బిలియనీర్ల జాబితాలో కొత్తగా ఏడుగురికి చోటు లభించగా, బైజూస్ అధినేత బైజూ రవీంద్రన్ భార్య దివ్యా గోకుల్ నాథ్తోపాటు ఎనిమిది మంది.. ఫోర్బ్స్ ఇండియా టాప్ బిలియనీర్ల జాబితాలో చోటుకోల్పోయారు. 100 మంది బిలియనీర్లలో కొత్తగా లాండ్ మార్క్ చైర్ పర్సన్ రేణుకా జగతియానీ, ఏషియన్ పెయింట్స్ `దానీ` కుటుంబం, దుస్తుల ఎగుమతిదారు కేపీ రామస్వామి చేరారు. 40 ఏండ్ల వయస్సు గల జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్ అత్యంత చిన్న వాడు.