IT Returns | ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఈ నెలాఖరు (జూలై 31) తుది గడువు. ఈ గడువును ఎటువంటి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. పెనాల్టీలు, ఇతర చట్టపరమైన సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు గడువులోపు పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయాలల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పన్ను చెల్లింపుదారులు, వేతన జీవుల వెసులుబాటు కోసం గత రెండేండ్లుగా ఐటీఆర్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది.
కానీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విభిన్నంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని తేల్చేసింది. ఇలా ఐటీఆర్ దాఖలు గడువు పొడిగించబోమని కేంద్రం ప్రకటించడం మూడేండ్లలో ఇదే తొలిసారి. గత శుక్రవారం కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించాలని ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. అందుకు కారణాలివి..
ఆదాయం పన్ను చట్టం (ఐటీ) రూల్స్ ప్రకారం వేతన జీవుల ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31 తుది గడువు. ఐటీఆర్ దాఖలు చేయడం తేలికైందని తమకు వేతన జీవుల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. అంతే కాదు.. ఐటీఆర్ దాఖలు చేసిన వారికి రీఫండ్స్ కూడా త్వరితగతిన వస్తాయన్నారు.
త్వరితగతిన ఐటీఆర్ దాఖలు చేయడానికి కేంద్రం గతేడాది నూతన ఐ-టీ ఫైలింగ్ పోర్టల్ ప్రారంభించింది. అది ఇప్పుడు ఎంత లోడ్ పెరిగినా తట్టుకునే స్థాయికి చేరుకుందని ఐటీ అధికారులు చెబుతున్నారు. గతేడాది చివరి రోజు 50 లక్షల మందికి పైగా ఐటీఆర్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఐటీ విభాగం అధికారులు.. చివరి రోజు కోటి మంది ఐటీఆర్స్ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తరుణ్ బజాజ్ చెప్పారు.
గతేడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 5.89 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. నూతన ఐటీ పన్ను చట్టం కింద రూ.2.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఉన్నాయి. పాత విధానం ప్రకారం 60 ఏండ్ల లోపు వారికి రూ.2.5లక్షలు, 60-80 ఏండ్లలోపు వారికి రూ.3 లక్షలు, 80 ఏండ్లు దాటిన వారికి రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు లభిస్తాయి.