Google | ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పని చేస్తున్నది. పోటీ టెక్ కంపెనీలతో పోలిస్తే గూగుల్ ఏఐ విషయంలో వెనుకబడింది. ఈ క్రమంలో ఏఐ విషయంలో మరింత శ్రమించేందుకు సిద్ధమవుతున్నది. కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ సీరియస్గా ఉన్నారు. పనికి ఆటంకం కలిగించే, తోటి ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రవర్తనను ఉపేక్షించేది లేదని బ్లాగ్ పోస్ట్లో సుందర్ పిచాయ్ హెచ్చరించారు. గూగుల్ ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టాలని.. ఆఫీసు ప్రదేశాన్ని ఉత్పత్తుల తయారీకి మాత్రమే ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత వేదికగా మార్చుకోరాదన్నారు.
ఇది ఓ వ్యాపారమని.. అంతేకానీ సహోద్యోగులకు ఆటంకాలు సృష్టించేందుకు, వారి భద్రతకు కలిగించేందుకు కంపెనీని వ్యక్తిగత వేదికగా ఉపయోగించుకొనే ప్రదేశం కాదన్నారు. పనికి భంగం కలిగించే అంశాలు, రాజకీయాలపై చర్చించే వేదిక కాదని.. ఓ కంపెనీగా మనం దృష్టిమరల్చేందుకు ఇది ఏమాత్రం సరైన సందర్భం కాదని గూగుల్ సీఈవో పేర్కొన్నారు. అయితే, గూగుల్ ఉద్యోగులు ఆఫీసుల్లో నిరసనలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ నిరసనలు జరిగాయి.
కానీ, నిరసనలు చేపట్టిన విధానం, నిరసన సందర్భం కంపెనీకి, పిచాయ్కి ఏమాత్రం మింగుడుపడడం లేదు. వివిధ సీక్రెట్ ప్రాజెక్టులపై వివిధ దేశాల ప్రభుత్వాలతో గూగుల్ కలిసి పని చేసింది. అయితే, ఇదే కొందరు ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతున్నది. ఇటీవల కంపెనీ ఇజ్రాయెల్తో క్లౌడ్ సేవల కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ పలువురు ఆందోళన చేపట్టగా 28 మందిని గూగుల్ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ఇందులో తొమ్మిది ఉద్యోగులను సస్పెండ్ చేయగా.. పోలీసులు అరెస్టు చేసినట్లు ‘ది వెర్జ్’ పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్ 1.2 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకోగా.. దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఆందోళనపై కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యాలయంలో ఇలాంటి ప్రవర్తనను సహించబోమని చెప్పింది. ‘మా కంపెనీ ఉద్యోగులు సరిగ్గా పని చేస్తారు. కంపెనీ విధానాలను ఉల్లంఘించే కొద్దిమందిలో మీరుంటే మరోసారి ఆలోచించండి’ అంటూ ఉద్యోగులకు పపిన అంతర్గత మెమోలో గూగుల్ పేర్కొంది.