న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: సబ్బులు, డిటర్జెంట్ల ధరల్ని హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ఏప్రిల్ నెలలో మరోసారి పెంచింది. లైఫ్బాయ్, డవ్, పియర్స్ సోప్స్తో పాటు వీల్ డిటర్జెంట్ పౌడర్, విమ్ లిక్విడ్ ధరల్ని 20 శాతం వరకూ పెంచింది. ముడి సరకుల ధరలు పెరిగినందున కొన్ని ఉత్పత్తుల ధరల్ని పెంచాల్సివచ్చిందని హెచ్యూఎల్ తెలిపింది. కంపెనీ గత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ధరల పెంపును ప్రారంభించింది.
ఫిబ్రవరి నెలలో లక్స్, లైఫ్బాయ్ సబ్బులు, డవ్ షాంపూ, విమ్ డిష్వాషింగ్ సోప్, సర్ఫ్ ఎక్సెల్ ధరలతో పాటు పెప్సోడెంట్, హార్లిక్స్, కిసాన్ జామ్ ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా డవ్, పియర్స్ సోప్స్ ధరల్ని అత్యధికంగా 20 శాతం వరకూ పెంచింది. 25 గ్రాముల డవ్, పియర్స్ ప్యాక్లు రూ.10 నుంచి రూ.12కు చేరగా, లైఫ్బాయ్ 4 సబ్బుల ప్యాక్ (ఒక్కోటి 125 గ్రాములు) రూ.124 నుంచి రూ.136కు పెరిగింది. 500 గ్రాముల వీల్ డిటర్జెంట్ ఫౌడర్ రూ.32 నుంచి రూ.33కు, ఒక కేజీ ప్యాక్ రూ. 63 నుంచి రూ.65కు చేరింది. 500 ఎంఎల్ విమ్ లిక్విడ్ ధర రూ.99 నుంచి రూ. 104కు పెరిగింది.