TESLA | న్యూఢిల్లీ, ఆగస్టు 25: అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీ దిగ్గజం టెస్లా.. అనుకున్నది సాధించినట్టే కనిపిస్తున్నది. భారత్లో అధిక పన్నులపై అనేకసార్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరునూ తప్పుబట్టిన సంగతీ విదితమే. అయితే నిన్నమొన్నటిదాకా మస్క్ మాటలకు గట్టిగా బదులిస్తూ వచ్చిన మోదీ సర్కారు.. ఇప్పుడు మెత్తబడిందన్న సంకేతాలు వస్తున్నాయి. మేకపోతు గాంభీర్యాన్ని విడిచి మస్క్ డిమాండ్ల ముందు మోకరిల్లినట్టే తెలుస్తున్నది మరి. ఈవీ కార్లపై వసూలు చేస్తున్న 100 శాతం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పరిమితం చేయాలన్న ఆలోచనలో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఓ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని తెచ్చేందుకు చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఈవీలపై దిగుమతి సుంకాల తగ్గింపు ప్రతిపాదనేదీ తమ వద్దకు రాలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే ఈ అంశం ప్రాథమిక చర్చల్లో ఉన్నందున త్వరలోనే ప్రతిపాదనలు రావచ్చన్న రీతిలో ఇతర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తుండటం గమనార్హం.
ఏ దేశానికైనా ఆ దేశ ప్రయోజనాలే ముఖ్యంగా ఉండాలి. అందుకే భారత్లో విదేశీ ఆటో రంగ సంస్థలు తయారీ మొదలుపెట్టి ఇక్కడ స్థిరపడ్డ తర్వాతే దిగుమతి సుంకాల్లో ఏదైనా తగ్గింపు తేవడం మంచిదన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తున్నది. ఈవీల తయారీ సంస్థలు భారత్లో కనీసం 40 శాతం వాహనాలను తయారు చేస్తామంటేనే దిగుమతి సుంకాన్ని 100 శాతం నుంచి 15 శాతానికి తగ్గించే విషయం ఆలోచిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుండటంపై ఎక్స్పర్ట్స్ పైవిధంగా వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ కంపెనీల మాటలు నమ్మి విధానాల్లో మార్పులు చేస్తే బొక్కబోర్లా పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. దిగుమతి సుంకం తగ్గితే.. టెస్లా ఇప్పుడు విదేశాల్లో తయారు చేస్తున్న అన్ని మాడళ్లను భారతీయ మార్కెట్లో విక్రయానికి పెడుతుందని, ఇది ఆ సంస్థకే లాభిస్తుంది తప్ప.. దేశానికి కాదని అంటున్నారు. పైగా ఇప్పటికే భారత్లో తయారీకి దిగిన ఇతర సంస్థలకు ఇది దెబ్బవుతుందని, భవిష్యత్తులో వ్యాపారం లేక ఆ కంపెనీల ప్లాంట్లు మూతబడితే.. ఉపాధి, ఉద్యోగావకాశాలు దూరమై నిరుద్యోగం పెరిగిపోతుందని చెప్తున్నారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కుంటుబడే ప్రమాదం ఉంటుందని వివరిస్తున్నారు.
ఈవీలపై దిగుమతి సుంకాల తగ్గింపు వార్తలు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో అలజడికి దారితీశాయి. ఈవీలను అమ్ముతున్న టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర ఆటో రంగ కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ ధర 1.60 శాతం, టాటా మోటర్స్ షేర్ విలువ 1.50 శాతం పడిపోయాయి. ఇప్పుడిప్పుడే ఈవీల తయారీపై దృష్టి పెడుతున్న మారుతీ సుజుకీ షేర్ విలువ కూడా 0.63 శాతం నష్టపోవడం గమనార్హం.
‘కేంద్ర ప్రభుత్వం ఆలోచన సరికాదు. కొత్త ఈవి పాలసీతో భారీగా తగ్గబోయే దిగుమతి సుంకాలు.. విదేశాల్లో తయారైన ఈవీలకు భారతీయ మార్కెట్లో గిరాకీని పెంచుతాయి. వాటి ధరలు తగ్గి, ఇక్కడే తయారవుతున్న మా వాహనాలకు పోటీగా మారుతాయి. ఇది మాకు నష్టం. అందుకే దిగుమతి సుంకాల తగ్గింపును మేము వ్యతిరేకిస్తున్నాం’
-భారతీయ ఆటో రంగ పరిశ్రమ
కేవలం టెస్లా పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం.. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్నే తాకట్టు పెట్టబోతున్నదన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దేశంలో తయారీని ప్రోత్సహించడానికే దిగుమతి సుంకాలను భారీగా పెంచామని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వాటినే నామమాత్రపు స్థాయికి తెచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శిస్తున్నారు. కొత్త ఈవీ పాలసీ గనుక అమల్లోకి వస్తే ఇక దేశంలోకి విదేశాల్లోనే పూర్తిగా తయారైన ఈవీ కార్లు వచ్చేయనున్నాయి. ప్రస్తుతం విదేశాల్లోనే పూర్తిగా తయారైన ఈవీ కార్లు భారత్కు రావాలంటే దాని ధరపై 100 శాతం పన్ను పడుతున్నది. అందుకే ఆయా విడిభాగాలను భారత్లోకి తెచ్చి ఇక్కడి ప్లాంట్లలో బిగించి కార్లను స్థానిక మార్కెట్లో అమ్ముకుంటున్నాయి విదేశీ కంపెనీలు. కానీ కొత్త విధానం వస్తే పన్ను 15 శాతానికి దిగిపోతుంది. ఫలితంగా ఇప్పటిలా ఇకపై దేశంలో తయారీ ఉండబోదన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈ ఏడాది జూన్లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్తో ప్రధాని మోదీ భేటీ జరిగినది తెలిసిందే.