Fitch on GDP | వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ భారీగా తగ్గించేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 10.3 నుంచి 8.5 శాతానికి మాత్రమే పరిమితం అవుతుందని మంగళవారం పేర్కొంది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధమేనని, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయని తెలిపింది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వేవ్ ప్రభావం త్వరగానే తగ్గిపోవడంతో ఆంక్షలు ఉపసంహరించారు. దీంతో జూన్తో ముగిసే త్రైమాసికంలో వృద్ధిరేటు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. 2021-22లో జీడీపీ వృద్ధిరేటు 0.6 శాతం పెరిగి 8.7 శాతానికి చేరుతుందని పేర్కొంది.
గ్లోబల్ ఎకనమిక్ ఔట్లుక్-మార్చి 2022 పేరిట నివేదిక విడుదల చేసింది ఫిచ్. కరోనా మహమ్మారి తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్నా.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధంతో ఇంధన సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. ప్రపంచ దేశాలకు ఫ్యూయల్ సరఫరాలో రష్యా వాటా 17 శాతం, నేచురల్ గ్యాస్ సరఫరాలో 12 శాతం వాటా ఉంది.
ఇంతకుముందు మరో రేటింగ్ సంస్థ మూడీస్ కూడా జీడీపీ అంచనాలను కుదించి వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును 9.1 శాతానికి తగ్గిస్తున్నట్టు మూడీస్ ప్రకటించింది. అధిక ఇంధన, ఎరువుల దిగుమతి బిల్లు కారణంగా ప్రభుత్వ మూలధన వ్యయం పరిమితంగా ఉంటుందన్న కారణంతో తాము గతంలో వేసిన 9.5 శాతం వృద్ధి అంచనాలో కోత విధిస్తున్నట్టు పేర్కొంది.