Electric-Air Taxi | మరో మూడేండ్లలో అంటే 2026లో భారత్లో తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసు అందుబాటులోకి రానున్నది. దేశంలో అత్యధిక విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఇందుకోసం అమెరికాకు చెందిన ‘ఆర్చర్ ఏవియేషన్’తో జత కట్టింది. ఇందుకోసం భాగస్వామ్య ఒప్పందంపై ఇంటర్ గ్లోబ్ ఎండీ నిఖిల్ గోయల్, ఆర్చర్ ఏవియేషన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంతకాలు చేశారు.
ఎయిర్ టాక్సీ సర్వీసులను ఆర్చర్ ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీఓఎల్) మిడ్ నైట్ ఎయిర్ క్రాఫ్ట్ అందిస్తాయి. రోడ్డు మార్గంలో 90 నిమిషాలు పట్టే ప్రయాణం ఎయిర్ టాక్సీలో కేవలం ఏడు నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఉదాహరణకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి గుర్గ్రామ్ వరకూ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 60 నుంచి 90 నిమిషాల టైం పడుతుంది. అదే ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలో కేవలం ఏడు నిమిషాల్లోనే పూర్తవుతుంది.
రాపిడ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లైట్స్ మాదిరిగా మిడ్ నైట్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేశారు. హెలికాప్టర్ మాదిరిగా ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ వెర్టికల్ టేకాఫ్ తీసుకుంటుంది. ఈ సర్వీసుల నిర్వహణకు ప్రత్యేకంగా రన్ వే అవసరం లేదు. 200 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీఓఎల్) మిడ్ నైట్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు కోసం నిధులు సేకరించాల్సి ఉంటుందని ఇండిగో సంస్థ తెలిపింది. అర్బన్ ఎయిర్ ట్యాక్సీ సర్వీసు మొదలు వస్తువుల రవాణా, వైద్య, అత్యవసర, చార్టర్ సర్వీసుల నిర్వహణకు ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉపయోగించుకోవచ్చు.