IDBI Bank Privatisation | ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యేలా కనిపించడం లేదు. బ్యాంక్ ప్రైవేటీకరణకు ఫైనాన్సియల్ బిడ్స్ను వచ్చే మార్చిలో ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ముగుస్తుందని వారు చెప్పారు.
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)తోపాటు వాటాలు కలిగి ఉన్న ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం గతవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆసక్తి గల ఇన్వెస్టర్లు వచ్చే డిసెంబర్ 16లోగా బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటాల ఉపసంహరణకు కేంద్రం ప్రిలిమినరీ బిడ్లు ఆహ్వానించడంతో ఆ బ్యాంకు షేర్లు సోమవారం 11 శాతం పుంజుకున్నాయి.
ఐడీబీఐ బ్యాంకులో వాటాల కొనుగోలుకు దాఖలైన ప్రిలిమనరీ బిడ్లను, ఆసక్తి గల సంస్థల స్థితిగతులపై ఆర్బీఐ సరైన అంచనా నివేదిక సమర్పించాక కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తే గానీ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కానున్నది. ఫైనాన్సియల్ బిడ్లు దాఖలు చేయడానికి ఆరు నెలల టైం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఐడీబీఐ బ్యాంకులో వాటాల ఉపసంహరణకు ఫైనాన్సియల్ బిడ్స్ ఆహ్వానించొచ్చునని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రక్రియ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, సెబీ రిజిస్టర్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ సంస్థలు వ్యక్తిగతంగా గానీ, కన్సార్టియంగా గానీ బిడ్లు దాఖలు చేయొచ్చు. బిడ్లు దాఖలు చేసిన సంస్థలు గత మూడేండ్ల నుంచి ఐదేండ్ల నికర లాభాల నివేదికలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. రూ.22,500 కోట్ల నికర నిధులు సిద్ధంగా ఉంచాలి. దీంతోపాటు 40 శాతం ఈక్విటీ ఐదేండ్ల పాటు లాక్ అయి ఉంటుంది.
ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 49.24 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. కేంద్రం ప్లస్ ఎల్ఐసీ కలిపి 94.72 శాతం వాటా కలిగి ఉన్నాయి. మరో 5.2 శాతం వాటాలను పబ్లిక్ షేర్ హోల్డర్లు కలిగి ఉన్నారు. ఎల్ఐసీ తన 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం వాటాలను విక్రయిస్తాయి. యాజమాన్య హక్కులు కూడా బదిలీ చేస్తారు.