న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వం అందించే కొన్ని సబ్సిడీలు పెరగకపోగా, కాస్త తగ్గడం తమకు ఊరటనిచ్చిందని, దీంతో ద్రవ్యలోటును పరిమితం చేయగలుగుతామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పారు. ముఖ్యంగా ఆహార, ఎరువుల సబ్సిడీలు తగ్గడానికి కారణం ఆయా ఉత్పత్తుల ధరలు దిగిరావడమేనని వెల్లడించారు. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గినందున, ఎరువులకు సబ్సిడీ అంచనాను కుదించామన్నారు. ఎరువుల సబ్సిడీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.88 లక్షల కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపును రూ.1.64 కోట్లకు తాజా మధ్యంతర బడ్జెట్లో తగ్గించారు.
అలాగే ఆహార సబ్సిడీ కేటాయింపుల్ని సైతం రూ.2.12 లక్షల కోట్ల నుంచి తగ్గించి రూ. 2.05 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. ఈ తరహాలో సబ్సిడీల భారం తగ్గడం, రెవిన్యూ వృద్ధిచెందడం, పన్నుయేతర ఆదాయం కూడా పెరగడంతో 2024-25 సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనాల్ని 5.1 శాతానికి తగ్గించగలిగామని వివరించారు. పరిమాణం రీత్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనా (రూ.17,34,773 కోట్లు (జీడీపీలో 5.8 శాతం)కాగా, వచ్చే ఏడాదిలో రూ.16,85,494 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.