Retail Market | న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశీయ రిటైల్ మార్కెట్కు పండుగ కళ వచ్చింది. ఈ పండుగ సీజన్లో ఇప్పటిదాకా రూ.3.75 లక్షల కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగినట్టు ట్రేడర్స్ సంఘం అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) సోమవారం తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా జోరుగా విక్రయాలు సాగినట్టు సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల్లో ఆకర్షణీయమైన సేల్స్ నమోదయ్యాయి. వినాయక చవితితో మార్కెట్లో పండుగ సందడి మొదలవుతుందన్న విషయం తెలిసిందే. విజయదశమి, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వరకు కొనసాగుతుందన్న సంగతీ విదితమే. ఉత్తరాదిలో మరికొన్ని పర్వదినాలూ ఉంటాయి.
చైనా మార్కెట్కు దెబ్బ
ఈ ఏడాది పండుగ సీజన్లో దేశీయంగా తయారైన వస్తూత్పత్తులకే బాగా గిరాకీ ఉందని ఈ సందర్భంగా ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. ముఖ్యంగా ఈ దీపావళికి చైనా ఉత్పత్తుల సేల్స్ లక్ష కోట్ల రూపాయలకుపైగా తగ్గిపోయాయన్నారు. పటాకులతోపాటు డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ ఎక్కువగా స్థానికంగా తయారైన వాటికే ఆదరణ ఉన్నట్టు వెల్లడించారు. మునుపు దీపావళి అమ్మకాల్లో దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తుల వాటానే ఉండేదని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు భారతీయ వస్తూత్పత్తులకు మన మార్కెట్లో అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. ఇది శుభపరిణామంగా పేర్కొన్నారు. ఈ దీపావళికి దేశీయ ప్రోడక్ట్స్కే డిమాండ్ ఎక్కువగా కనిపించినట్టు వెల్లడించారు.
ఆటో నుంచి గోల్డ్దాకా..
ఈ పండుగ సీజన్లో వాహనాల దగ్గర్నుంచి బంగారందాకా.. దుస్తుల నుంచి గృహోపకరణాల వరకు అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు బాగా జరిగినట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ధంతేరస్ సందర్భంగా వాహన విక్రయాలూ భారీగానే నమోదయ్యాయి. రెండంకెల వృద్ధి ఉందని ఆటో కంపెనీలు తెలిపాయి. బంగారం అమ్మకాలు సైతం 15-20 శాతం పెరిగినట్టు నగల వర్తకులు పేర్కొంటున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ అవెన్లు, మిక్సర్ గ్రైండర్లు ఇలా అనేకానేక గృహోపకరణాల సేల్స్ కూడా పెరిగినట్టు చెప్తున్నారు. అయితే ఈ-కామర్స్ కంపెనీలతో పోటీగా బహిరంగ మార్కెట్లో వ్యాపార సంస్థలు డిస్కౌంట్లు, బహుమతుల్ని పెట్టడం కలిసొచ్చిందని ట్రేడింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆన్లైన్.. ఆఫ్లైన్లో
ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ ఈ పండుగ సీజన్కు అమ్మకాలు పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ఓవైపు ఆన్లైన్ సైట్స్లో కొనుగోళ్లు జరుపుతూనే.. మరోవైపు సంప్రదాయ మార్కెట్లోనూ కస్టమర్లు సందడి చేయడం గమనార్హం. దీంతో మార్కెట్ మొత్తం పండుగ వాతావరణం నెలకొన్నది. కాగా, గోవర్ధన్ పూజ, బైయా దూజ్, చాత్ పూజ, తులసీ వివాహ్ వంటి శుభకార్యాలు ఇంకా జరుగాల్సి ఉన్నందున అమ్మకాలు పెరుగుతాయన్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ర్టాల్లో మరో రూ.50వేల కోట్ల వ్యాపారాని వీలుందని అంచనా వేశారు.