Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులతో తొలుత స్వల్ప లాభాలతో మొదలైన ట్రేడింగ్.. అటుపై తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంది. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగియడానికి 90 నిమిషాల ముందు ఊగిసలాట మధ్య ట్రేడింగ్ కొనసాగింది. చివరి దశలో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్లు లాభాలు గడించారు. తద్వారా రెండు వరుస సెషన్ల నష్టాలకు తెర పడింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 66,063.72 పాయింట్లతో స్వల్ప లాభాలతో మొదలైంది ట్రేడింగ్. కానీ అంతర్గత ట్రేడింగ్లో 66,256.20 పాయింట్ల గరిష్టం.. 65,906.65 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 204.16 పాయింట్ల లబ్ధితో 66,174.20 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 19,844.65 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. అంతర్గత ట్రేడింగ్లో 19,917-19,800 పాయింట్ల మధ్య తచ్చాడింది. అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి 95 పాయింట్లు పుంజుకుని 19,889.70 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.83.34 వద్ద ముగిసింది.
బీఎస్ఈ-30 సెన్సెక్స్లో టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా లాభ పడగా, హెచ్యూఎల్, సన్ ఫార్మా, ఐటీసీ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ పతనమయ్యాయి.