పండుగ సీజన్లో ఇబ్బందులు తప్పదన్న ఫాడా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటోమొబైల్ సంస్థలకు సెమికండక్టర్ల రూపంలో పిడుగు పడింది. వచ్చేది పండుగ సీజన్లో అమ్మకాలు భారీగా పుంజుకుంటాయని ఆశిస్తున్న సంస్థలకు సెమికండక్టర్ల కొరత తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. సెమికండక్టర్ల కొరతతో అనుకున్న సమయానికి వాహనాలు రాక డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫాడా హెచ్చరించింది.
ఈ పండుగ సీజన్లో ప్యాసింజర్ వాహనాలకు అధిక డిమాండ్ ఉంటుందని అంచనావేసిన ఫాడా..ఇదే సమయంలో సెమికండక్టర్ల కొరతతో ప్యాసింజర్ వాహన డీలర్లు తీవ్ర ఇబ్బందుల పాలుకావచ్చునని ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి తెలిపారు. మహమ్మారి కారణంగా మూతపడిన ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లు ఇప్పుడిప్పుడే తెరుస్తుండటంతో ద్విచక్ర వాహనాలకు భవిష్యత్తులో డిమాండ్ ఉండే అవకాశం ఉన్నదని ఆయన అంచనావేస్తున్నారు.
ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 39 శాతం ఎగబాకి 2,53,363లకు చేరాయి.
ద్విచక్ర వాహన సేల్స్ 7 శాతం అధికమై 9,76,051లకు చేరాయి.
కమర్షియల్ వాహన సేల్స్ ఏడాది ప్రాతిపదికన 97 శాతం పెరిగి 53,150లకు చేరుకున్నాయి.
30,410 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో 80 శాతం పెరుగుదల కనిపించింది.