Stock Market | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. రికార్డు గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారు. ఫలితంగా అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,156. 57 పాయింట్లు లేదా 1.55 శాతం కోల్పోయి 73,088.33 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 372.4 పాయింట్లు లేదా 1.65 శాతం పడిపోయి 22,147 వద్ద నిలిచింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణలవైపే మొగ్గు చూపవచ్చన్న అంచనాలున్నాయి.
అయితే కొంతమేర కొనుగోళ్లకూ దిగవచ్చన్న అభిప్రాయాలున్నాయి. దీంతో ఆటుపోట్లకు ఆస్కారం ఉందని చెప్పవచ్చు. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, వివిధ అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్ తీరును నిర్దేశించనున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, చమురు మార్కెట్ తీరుతెన్నులు ఎక్కువగా ప్రభావితం చేయవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక నిఫ్టీకి 22,000 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 21,700 మద్దతు స్థాయిగా చెప్పుకోవచ్చని మెజారిటీ నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 22,400-22,600 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చు.