న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో మే మాసంలో భారత తయారీ రంగ కార్యకలాపాల వృద్ధి రేటు పదేండ్ల కనిష్టానికి పడిపోయింది. కరోనా కేసుల పెరుగుదలతో డిమాండ్ తగ్గడం, ముడిపదార్ధాల ధరలు భారం కావడంతో మే లో తయారీ రంగ వృద్ధి పతనమైనట్టు ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ సహా కఠిన నియంత్రణలు విధించడం ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగించింది.
ఐహెచ్ఎస్ మార్కిట్ మదింపు చేసిన నిక్కీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏప్రిల్ లో 55.5 నుంచి మేలో 50.8 శాతానికి పతనమైంది. జులై 2020 తర్వాత ఈ సూచీ ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. తయారీ రంగం సహా అన్ని కీలక సూచీలు ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పట్టాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలిన డిలిమ పేర్కొన్నారు.