న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కొన్ని కీలక వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై నియంత్రణలు విధించిన ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం 4.5-5 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు తగ్గుతాయని కేంద్ర వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ చెప్పారు. గోధుమ, నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించింది. అయితే ఈ చర్యలతో తగ్గే ఎగుమతుల విలువ ఇతర ఉత్పత్తుల ఎగుమతులతో భర్తీ అవుతుందని అగర్వాల్ గురువారం మీడియాకు తెలిపారు. మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరం గత ఏడాదిలానే వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 53 బిలియన్ డాలర్లకు చేరతాయన్నారు.
అరటి, మిల్లెట్ ఉత్పత్తులు తదితరాలను కొత్త అంతర్జాతీయ కేంద్రాలకు ఎగుమతుల్ని ప్రారంభించామని, వచ్చే మూడేళ్లలో అరటిపండ్ల ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరతాయని అంచనా వేస్తున్నామన్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఎగుమతులు ఈ ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో వృద్ధిచెందాయని, బియ్యం ఎగుమతులు మాత్రం 7.65 శాతం క్షీణించి, 6.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని వివరించారు.