న్యూఢిల్లీ, జూలై 14: గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా ఈ జూన్ నెలలో ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగించిన ప్రభావంతో ముగిసిన నెలలో ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్ డాలర్లకు తగ్గాయి. కొవిడ్ పాండమిక్ నేపథ్యంలో 2020 మే నెలలో ఎగుమతులు 33.47 శాతం క్షీణించగా, ఈ స్థాయిలో తగ్గడం తిరిగి 2023 జూన్ నెలలోనే జరిగింది. మరోవైపు జూన్లో దిగుమతులు సైతం భారీగా 17.48 శాతం తగ్గి 53.10 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా తగ్గడంతో వాణిజ్యలోటు 20.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. 2022 జూన్లో ఇది 22.07 బిలియన్ డాలర్లు. గణాంకాల వివరాలు..
జూన్ నెలలో మొత్తం 30 కీలక రంగాల్లో 21 రంగాల ఎగుమతుల వృద్ధి మైనస్లో పడిపోయింది. పెట్రోలియం ఉత్పత్తులు, తగ్గినవాటిలో ప్లాస్టిక్, రెడీమేడ్ దుస్తులు, ఇంజనీరింగ్, కెమికల్స్, జెమ్స్ జ్యువెల్లరీ, లెదర్, సముద్ర ఉత్పత్తులు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఎగుమతుల మాత్రం 45.36 శాతం పెరిగి 2.43 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో ఈ ఎగుమతులు 47 శాతం పెరిగి 6.96 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
దేశాలవారీగా చూస్తే నెదర్లాండ్స్, యూకే, సౌదీ అరేబియాలకు ఎగుమతులు పెరగ్గా. చైనా, యుఏఈ, యూఎస్, జర్మనీ, ఇటలీ, బంగ్లాదేశ్లకు తగ్గాయి.